Jagan : ఏపీ సీఎం జగన్ .. చంద్రబాబు పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జగనన్న చేదోడు మూడో విడత నిధులను వినుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. అదే సమయంలో పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. అదే విధంగా టీడీపీ, జనసేనపై ఘాటు విమర్శలు చేశారు.
రాష్ట్రంలో తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని జగన్ మండిపడ్డారు. సింహంలా మీ బిడ్డి సింగిల్ గానే ఎన్నికల సమరంలోకి దిగుతాడని ప్రజలకు స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలను నమ్మనని తేల్చిచెప్పారు. ప్రజలపైనే తనకు విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి పెత్తందారీ మధ్య పోటీగా పేర్కొన్నారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా? తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.
రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని స్పష్టం చేశారు. గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేసిందని ఆరోపించారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గజదొంగల ముఠా అని ఆరోపించారు. టీడీపీ హయాంలో డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సభలో జగన్ …జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు టీడీపీ కలిసిపోయారని విమర్శించారు.