Jagan : ఏపీలో ఎన్నికలకు ఇక 14 నెలల మాత్రమే సమయం ఉంది. దీంతో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఏదో కార్యక్రమం ద్వారా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచార యాత్ర చేపట్టేందుకు వారాహి వాహనం సిద్ధం చేశారు. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా దూకుడును పెంచారు.
పథకాలే ప్రచారాస్త్రాలు..
ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ సీఎం జగన్ పదేపదే చెబుతున్నారు. సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిర్దేశిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తూ ఎవరు పోటీలో ఉంటారో స్పష్టత ఇస్తున్నారు. ఇంకోవైపు సీఎం జగన్ ప్రభుత్వ కార్యక్రమాల వేదికలపై నుంచే ప్రచారం చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను తెనాలి నుంచి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మంది రైతులకు రూ.1,090.76 కోట్లు జమ చేశారు. నాలుగేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి రూ.54 వేల చొప్పున సాయం అందించామని చెప్పారు. ఈ నాలుగేళ్లలో రైతు భరోసా కింద రూ.27,062 కోట్లు సాయం అందించామని జగన్ వివరించారు. ఇలా రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షాలపై ఫైర్..
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉందన్నారు. కడుపు మంటకు, అసూయకు మందు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన చంద్రబాబుకు తనకు మధ్య యుద్ధం జరగబోతోందని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దన్న చంద్రబాబుతో యుద్ధం జరగబోతోందని తెలిపారు. రాష్ట్రంలో గజ దొంగలముఠా ఉందని.. ఈ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమేనని ఆరోపించారు. గజదొంగల ముఠాకు దుష్టచతుష్టాయానికి దత్తపుత్రుడు జత కలిశారని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి జగన్ విమర్శలు గుప్పించారు.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
గత ప్రభుత్వం ఏం చేసిందో .. తన ప్రభుత్వం ఏం చేస్తోందో సభా వేదికపై జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఎందుకు సంక్షేమ పథకాలు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నిలదీశారు. తన పాలనకు.. చంద్రబాబు పాలనకు తేడా గమనించాలని ప్రజలను కోరారు. మంచి జరిగిందని అనిపిస్తే తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు.
బాబు, పవన్ కు సవాల్..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సీఎం జగన్ సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. తనకు ఆ భయంలేదని స్పష్టం చేశారు. చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.