ISRO PSLV C58: అంతరిక్షంలో ఇప్పటివరకు కేవలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. వాటి సరసన భారత్ను నిలబెట్టాలనే దిశగా శాస్త్రవేత్తలు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారు. ఇస్రో తాజాగా చేపట్టిన PSLV-C58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం శాస్త్రవేత్తలకు ఎక్కడలేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించి తొలి అడుగును ఇస్రో వేసేసింది. అంతరిక్షంలో పవర్ సోర్స్ కోసం తన వేటను ప్రారంభించింది.
2024 కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది ఇస్రో. పీఎస్ఎల్వీ- సి 58 రాకెట్ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి ప్రపంచదేశానికి తన సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పింది. ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని PSLV రాకెట్ నింగిలోని తీసుకెళ్లింది. ఎక్స్పోశాట్ ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది. ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన గత మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేయనుంది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోశాట్ లక్ష్యం. ఐదేళ్ల జీవితకాలంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. తాజా ప్రయోగంతో బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాల అధ్యయనానికి ఉద్దేశించిన ప్రత్యేక ఖగోళ శాస్త్ర అబ్జర్వేటరీని పంపిన ప్రపంచంలో రెండో దేశంగా భారత్ అవతరించింది. మొదటిది నాసా ఇమేజింగ్ ఎక్స్-రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ కాగా.. రెండోది ఎక్స్పోశాట్. ఎక్స్పోశాట్ ప్రత్యేకించి బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాల సమీపంలోని రేడియేషన్ను అధ్యయనం చేస్తుంది.
ఎక్స్-రే పొలారీమీటర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్పోశాట్తో పీఎస్ఎల్వీ సీ58 ఉపగ్రహం నిప్పులు కక్కుతూ నింగిలోకి వెళ్లింది. ప్రయోగం తరువాత 21 నిమిషాలకు ఎక్స్పోశాట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంది. ఎక్స్పోశాట్తో పాటూ తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిద పేలోడ్స్ కూడా ఉన్నాయి. ప్రయోగం చివరి దశలో PSLV మరో పది పేలోడ్స్ కూడిన ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొదటిసారిగా ఇస్రో ఈ పోలారిమెట్రి మిషన్ చేపట్టింది.
బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటిని అధ్యయనం చేసేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలోని 50 కాంతి పుంజాలను ఈ ప్రయోగం ద్వారా పరిశీలిస్తారు. ఈ కాంతిపుంజాల్లో బ్లాక్హోల్, ఎక్స్రే జంట నక్షత్రాలు, యాక్టివ్గా ఉన్న గెలాక్సీలు, న్యూట్రాన్ స్టార్స్ అవశేషాలు ఉన్నాయి. వాటిని ఈ శాటిలైట్ పరిశీలిస్తుంది. వీటిని పరిశోధించడంతో విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే బ్లాక్ హోల్స్ తీరుపై మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఇలాంటి ప్రయోగాలు ఇండియాకే కాకుండా ప్రపంచ దేశాలకు ఉపయోగపడతాయి.
ఫ్యూయల్ సెల్ పవర్ స్టేషన్ ను.. PSLV నాలుగో దశ అయిన ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ లో అమర్చారు. స్టార్టింగ్లో ఎక్స్పోశాట్ ను 650 కిలోమీటర్ల కక్ష్యలో ఉంచారు. నాలుగో దశలో భాగంగా దాన్ని 350 కిలోమీటర్ల కక్ష్యలోకి తగ్గించారు. అక్కడే ఫ్యూయల్ సెల్ పవర్ స్టేషన్ పని చేయడం ప్రారంభిస్తుందన్నటమాట. ఇలాంటి ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ధీర్ఘకాల అంతరిక్ష మిషన్లకు ఓ గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది కెమికల్ ఎనర్జీని పవర్గా మార్చుకుంటుంది. ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్తో ఆ టాస్క్ కంప్లీట్ చేస్తుంది. ఫ్యూయల్ సెల్ పవర్ స్టేషన్.. ఊహించినదాని కంటే మెరుగ్గా పనిచేస్తే.. అధిక విద్యుత్ శక్తిని అందిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమికి దగ్గరగా భూకక్ష్యలోనే స్పేస్ స్టేషన్ ను నిర్మించేలా ఇస్రో ప్లాన్ చేస్తోంది. కేవలం భూకక్ష్యకు 120 నుండి 140 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్ స్టేషన్ఉంటే.. మైక్రోగ్రావిటీ ప్రయోగాలకు వేదికగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మాములుగా హైడ్రోజన్ ను ఆక్సిజన్ ను కలిపి మండిస్తే వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే అంతరిక్షంలో అలా మండిచలేం కాబట్టి.. కేవలం హైడ్రోజన్ ఆక్సిజన్ ఎలక్ట్రోకెమికల్ తో రియాక్ట్ అవుతాయి. అలా రియాక్ట్ కావడం వల్ల అందులోంచి పవర్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ ను బ్యాటరీల్లో స్టోరేజ్ చేస్తారు. వాటర్ మాత్రం బయటకు వదిలేస్తారు. అదే అంతరిక్ష కేంద్రంలో అయితే ఆ వాటర్ ను కూడా తిరిగి యూజ్ చేసుకుంటారు. ఓ స్పేస్ స్టేషన్ నిర్మించాలంటే దాదాపుగా 20 కిలోవాట్ల కంటే ఎక్కువే విద్యుత్ అవసరముంటుంది. కానీ ఇప్పుడు ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగం చాలా చిన్నది. భవిష్యత్ లో భారత్ నిర్మించే అంతరిక్ష కేంద్రానికి ఇదో ప్రయోగంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కేవలం వంద వాట్ల విద్యుత్ ప్రొడ్యూస్ అయ్యేలా ఫ్యూయల్ సెల్ పవర్ స్టేషన్ ను అందులో అమర్చారు.
ఫ్యూయల్ సెల్ పవర్ స్టేషన్ విజయవంతం కావడంతో అంతరిక్షంలో భారత్ మరిన్నిసరికొత్త ప్రయోగాలు చేసే ఆస్కారముంటుంది. ముఖ్యంగా భారతీయ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసుకునే ఛాన్సుంది.
.
.