YS Sharmila: వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. నిజంగా అదే జరిగితే ఓట్లపరంగా వైసీపీకి ఒకింత ఇబ్బందే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే సోదరి షర్మిల ఏపీ వైపు రాకుండా నచ్చచెప్పడానికి సీఎం జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారంట. షర్మిలతో రాయబారానికి స్వయంగా బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించినట్టు సమాచారం.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలకు గడువు నెలల్లోకి వచ్చేసింది. అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టేశాయి. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయడానికి సిద్దమయ్యాయి. సీట్ల పంపకాలపై రెండు పార్టీల అధ్యక్షులు మంతనాలు కొనసాగిస్తున్నారు. వై నాట్ 175 అంటున్న వైసీపీ అధినేత జగన్ సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులను మార్చేస్తూ హడావుడి మొదలు పెట్టేశారు.
రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఏపీలో అనామకంగా మారిపోయిన కాంగ్రెస్ సైతం రానున్న ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సీఎం జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా షర్మిలతో కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డికే శివకుమార్ మంతనాలు కొనసాగిస్తున్నారంట. ఏదేమైనా షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడం, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖరారైందన్న ప్రచారంతో వైసీపీ పెద్దలు కంగారు పడుతున్నారంట. ఇప్పటికే టికెట్ల విషయమై వైసీపీ నేతలు కొందరు పార్టీపై అసంతృప్తితో ఉన్నారటున్నారు .. షర్మిల కనుక కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే అలాంటి వారంతా కాంగ్రెస్ వైపు చూసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది..
2014 ఎన్నికల ముందు జగన్ జైలులో ఉన్నప్పుడు.. ఆయన తరఫున సోదరి షర్మిల ఏపీలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అలాంటి షర్మిల తర్వాత జగన్ తో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన ఆమె.. అక్కడ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆమె ఏపీకి వస్తే జగన్ పార్టీకి అంతోఇంతో డ్యామేజ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. అన్నా చెల్లెలు ఏపీలో రాజకీయ ప్రత్యర్ధులుగా మారితే జగన్ ఇరకాటంలో పడటమే కాక వైఎస్ అభిమానుల ఓట్లలో చీలిక రావడం ఖాయమంటున్నారు.
అది దృష్టిలో పెట్టుకొనే షర్మిల కోసం జగన్ అండ్ కో రాయబారాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరకుండా చూడటానికి జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని రాయబారానికి పంపించారంటున్నారు. ఏపీలో జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది కుటుంబంలో చిచ్చు పెట్టినట్లవుతుందని, అది ఎవరికీ మంచిది కాదని షర్మిలకు సుబ్బారెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేశారంటున్నారు. అయితే వైవీ రాయబారం ఏ మాత్రం సక్సెస్ కాలేదంట. మొత్తమ్మీద షర్మిల ఏపీ పాలిటిక్స్లో అడుగుపెడుతున్నారన్న ప్రచారం వైసీపీ పెద్దల్లో గుబులు రేపుతున్నట్లే కనిపిస్తోంది.
.
.