KotamReddy: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు ఈయనే ఏపీలో హాట్ టాపిక్. జగన్ ను ధిక్కరించి.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి సంచలనంగా నిలిచారు. తన గొంతు ఆగాలంటే.. తనను ఎన్ కౌంటర్ చేయాల్సిందేనంటూ ఛాలెంజ్ కూడా చేశారు.
కోటంరెడ్డిపై వైసీపీ యాక్షన్ షురూ చేసింది. నెల్లూరు రూరల్ ఇంచార్జిగా తొలగించింది. ఓ కార్పొరేటర్ తన కార్యాలయంలో కోటంరెడ్డి ఫ్లెక్సీలను చించేశాడు. ఇక వైసీపీలో శ్రీధర్ రెడ్డిని ఒంటరి చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
ఇదంతా సరే. మరి కోటంరెడ్డి దారెటు? అంటే అంతా టీడీపీనే అంటున్నారు. ఆయన సైతం ప్రెస్ మీట్లో అదే విషయం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని.. కుదిరితే, చంద్రబాబు అంగీకరిస్తే.. టీడీపీ నుంచే బరిలో దిగుతానని అన్నారు. వైసీపీ సైతం కోటంరెడ్డి.. చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారని.. అక్కడ డీల్ కుదిరాకే సానుభూతి కోసం సర్కారుపై నిందలు వేస్తున్నారని మండిపడుతున్నారు. సో, కోటంరెడ్డి టీడీపీలో చేరడం పక్కా అనే ప్రచారం జరుగుతోంది.
కానీ, ఇప్పటి వరకూ టీడీపీ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. కోటంరెడ్డి ఎపిసోడ్ పై ఆ పార్టీ స్పందించ లేదు. అలాగని ఖండించనూ లేదు. మరి, కోటంరెడ్డికి టీడీపీ టికెట్ గ్యారెంటీనా? అంటే ఇప్పటికైతే చెప్పలేమనే అంటున్నారు. జనసేనతో పొత్తు ఉంటేనే.. టీడీపీ తరఫున పోటీ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. మరి, పొత్త లేకపోతే? ఇన్నాళ్లూ ఏ పార్టీకైతే వ్యతిరేకంగా పోరాడారో.. అదే పార్టీ కండువా కప్పుకుని ఎన్నికలకు వెళ్తారా? అంటే డౌటనే మాటా వినిపిస్తోంది.
ఈ విషయం మరెవరో అనడం కాదు.. స్వయంగా కోటంరెడ్డినే ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు. ఒకవేళ ఏపీలో ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వని పక్షంలో తాను భారత రాష్ట్ర సమితి- BRS తరఫున పోటీ చేసేందుకు సిద్ధమేనని శ్రీధర్ రెడ్డినే సెలవిచ్చారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ కు కావాల్సింది కూడా ఇలాంటి ఫైర్ బ్రాండ్ నేతలే అంటున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు కీలక నేతలకు గాలం వేస్తున్నారు గులాబీ బాస్. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. రిటైర్డ్ ఉన్నతోద్యోగులు.. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులే బీఆర్ఎస్ టార్గెట్. వారి లిస్టులో కోటంరెడ్డి కూడా ఎలాగూ ఉంటారు. టీడీపీతో డీల్ చెడితే.. శ్రీధర్ రెడ్డి కారు గుర్తుపై పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారుగా. ఏమో గుర్రం ఎగరావచ్చు…!!