Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి ఊరట లభించింది. రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన అమ్మమ్మకు అనారోగ్యంగా ఉందని.. ఈ క్రమంలో ఆమెను చూసేందుకు బెయిల్ మంజూరు చేయాలని రాఘవ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆమె బాత్ రూమ్ లో కాలు జారి పడటంతో ముక్కుకు తీవ్ర గాయమైందని… ఆమెను చూసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. కానీ దీనిపై వాదనలు వినిపించిన ఈడీ తరపు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయవద్దని వాదించారు. ఆమె బాగోగులు చూసుకునేందుకు చాలా మంది బంధువులు ఉన్నారని కోర్టుకు తెలిపారు. పైగా ఐసీయూలో ఉన్న రోగిని చూసేందుకు వైద్యులు అనుమతించే పరిస్థితి ఉండదని వాదించారు.
మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం… ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయడం తగదని వాదించారు. పైగా కేసులో నిందితుల బంధువులు బాత్రూంలో పడి గాయపడుతున్నారని… వారిని చూడడం కోసం బెయిల్ దరఖాస్తులు చేస్తున్నారని వాదించారు అదనపు సొలిసిటర్ జనరల్ రాజు. ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న ధర్మాసనం రాఘవ అమ్మమ్మ మెడికల్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంది. ఆయనకు రెండు వారాలపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోనీ పలు జోన్లకు కూడా రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేసింది. ఐతే ఇదే కేసులో ఇప్పటికే శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ క్రమంలో మాగుంట రాఘవ రెడ్డికి కూడా ఉపశమనం లభించింది.