Vijayawada’s Indrakiladri Durga Temple Ghatroad Closed: ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో సందడిగా ఉండే.. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతుండటంతోనే ఘాట్ రోడ్డును శనివారం రాత్రి నుంచి మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులు.. మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు.
మరోవైపు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించేందుకు వస్తున్న భక్తులతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో కూడా భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు.
కాగా.. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. జూలై 6న మొదలైన వారాహి నవరాత్రి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. నవరాత్రుల్లో భక్తులు అమ్మవారికి పూజలు చేసి.. సారె మహోత్సవం చేసి.. మొక్కులు తీర్చుకుంటారు. నేడు తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ కనకదుర్గ అమ్మవారికి బోనాలు సమర్పించనుంది. సాక్షాత్తు లలితా దేవి స్వరూపమైన వారాహి అమ్మవారిని అహంకారం తగ్గుతుందని భక్తుల నమ్మకం.
Also Read: Home Minister Anitha : అత్యాచార నిందితుల్ని వదలం.. బాధితుల కుటుంబాలకు పరిహారం : హోంమంత్రి అనిత
వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగిశాక.. జూలై 19వ తేదీ నుంచి మూడురోజులపాటు శాకాంబరీ దేవి ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. అమ్మవారికి మహానివేదన సమయంలో అధికారులు ప్రొటోకాల్ ను ఆపివేయనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ వీఐపీ దర్శనాలు ఉండవని తెలిపారు.