YSRCP latest news today(AP political news): ఏపీ అధికార పార్టీ వైసీపీ రాజకీయాల్లో భారీ కుదుపు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఐ ప్యాక్ టీమ్.. సంచలన రిపోర్ట్ అందజేసింది.
సీఎం జగన్ తో సమావేశమైన ఐ ప్యాక్ టీమ్.. రెండు నెలలుగా రాష్ట్రంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను అందజేసింది. దాదాపు 60 మంది సిట్టింగులను మార్చాలని రిపోర్ట్ లో తేల్చిచెప్పింది.
ఉత్తరాంధ్ర నుంచి 18 మంది, ఉభయగోదావరి జిల్లాల నుంచి 15, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 10 మంది, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 9 మంది, రాయసీమ జిల్లాల్లో 20 నుంచి 25 మంది వరకు సిట్టింగులను మార్చాలని సూచించింది. ఈ నివేదికతో.. ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు అర్థం అవుతోంది.
ఇటీవల పార్టీ ప్రజాప్రతినిధులు, రీజినల్ కోఆర్డినేటర్ల సమీక్షలో.. పనితీరు బాగోలేదని 18 మంది ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్. సర్వే రిపోర్టు ప్రకారమే సీట్లు ఇస్తానని.. తీరు మారక పోతే వేటు తప్పదని హెచ్చరించారు. అయితే, ఐ-ప్యాక్ లేటెస్ట్ సర్వేలో.. ఆ సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. 18 కాస్తా.. మూడురెట్లు పెరిగి.. ఏకంగా 60 మంది వరకు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తేల్చిందట సర్వే నివేదిక. ఆ మేరకు సీఎం జగన్ ముందు రిపోర్ట్ ఉంచినట్టు సమాచారం. జగనన్న సురక్ష.. కార్యక్రమం తరువాత మరోసారి సర్వే చేయనుంది I-PACK టీమ్. అప్పటికి ఈ సంఖ్య ఎంతకు మారుతుందో? నివేదికలో ఏ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయో? అనే టెన్షన్ వైసీపీ ప్రజాప్రతినిధులను కలవర పెడుతోంది.