Summons to Pawan Kalyan: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు భారీ షాకిచ్చింది. ఇటీవల న్యాయవాది రామారావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించిన కోర్టు పవన్ కు సమన్లు జారీ చేసింది.
తిరుమల లడ్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయం నుండి యావత్ భారత్.. ఆ విషయానికి సంబంధించిన ప్రతి వార్తపై దృష్టి సారించింది. దీనికి ప్రధాన కారణం నిరంతరం కోట్లాది మంది భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. అందులో తిరుమల లడ్డును ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు భక్తులు.
అటువంటి లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందంటూ రాజకీయ ఆరోపణలు వెలుగులోకి రాగా.. కూటమి వర్సెస్ వైసీపీ లక్ష్యంగా విమర్శలు సైతం సాగాయి. ఆ విమర్శలతో వైసీపీ నేతలు.. అత్యున్నత నాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనితో సుప్రీంకోర్టు విచారణ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీ అధ్వర్యంలో విచారణ సాగించాలని ఆదేశించింది. అలాగే రాజకీయ విమర్శల కోసం.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దంటూ పార్టీలకు సూచించింది.
ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రాయాశ్చిత్త దీక్ష చేపట్టి.. తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించి దీక్ష విరమించారు. అంతటితో ఆగక తిరుపతిలో వారాహి బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభ సాక్షిగా పవన్.. వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తూ చేసిన ప్రసంగం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ సభలో పవన్ ప్రసంగిస్తూ.. అయోధ్యకు పంపిన తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందని ప్రకటించారని, దీనితో కోట్లమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చేసిన ప్రసంగంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్ ను దాఖలు చేశారు. కోట్లాది మంది భక్తులు స్వీకరించే తిరుమల లడ్డు గురించి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని పిటీషనర్ పేర్కొన్నారు. అలాగే పవన్ చేసిన ప్రసంగాన్ని సోషల్ మీడియాల నుండి తొలగించేలా, ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.
దీనితో న్యాయస్థానం విచారణకు పిటీషన్ స్వీకరించి, నవంబర్ 22న పవన్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. దీనితో పవన్ కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు. అయితే పవన్ కోర్టుకు వస్తారా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.