High Tension in Tadipatri: ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. తాడిపత్రిలో మరోసారి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ ఘర్షణలో వైసీపీకి చెందిన వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ నేతలకు సంబంధించిన ఇంటిపై కూడా దాడి జరిగిందని, ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం అయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. పలువురు వైసీపీ నేతలను తాడిపత్రి నుంచి పంపించివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
Also Read: మాజీ మంత్రి జోగి రమేష్కు మరిన్ని కష్టాలు.. ఫ్యామిలీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
ఈ ఘటనపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేశారని, ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నదని పేర్కొన్నారు. తాడిపత్రిలో ప్రశాంతతను కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారంటూ అందులో పేర్కొన్నారు.
అదేవిధంగా ఇటు మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉందని మానవ హక్కులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనని తాడిపత్రికి రానివ్వకుండా ఇటువంటి గొడవలు చేస్తున్నారన్నారు. తనకు ప్రాణం ఉన్నంతవరకు తాడిపత్రిలోనే ఉంటానన్నారని అందులో స్పష్టం చేశారు.