Vishakapatnam steel plant news(Breaking news in Andhra Pradesh): పోలీస్ వర్సెస్ స్టీల్ ప్లాంట్ వర్కర్స్. టగ్ ఆఫ్ వార్ నడిచింది. తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు విశాఖ ఉక్కు కార్మికులు గట్టిగా ప్రయత్నించారు. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు మీదకు దండయాత్ర చేపట్టారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు.
పోర్టు ముట్టడికి వస్తున్నారనే విషయం తెలిసి.. పోలీసులు భారీగా మొహరించారు. గేటు దగ్గరే వారిని అడ్డుకునేందుకు బలగాలను తరలించారు. ఒకరా ఇద్దరా. ఎంతమందినని అడ్డుకుంటారు. వేలల్లో తరలివచ్చారు ఉక్కు కార్మికులు. ఖాకీలు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
పోలీసులను తోసుకుంటూ.. పోర్టు గేటు వరకూ దూసుకొచ్చారు. గేటుకు అడ్డంగా ఇనుప కంచెను అడ్డుపెట్టి కార్మికులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. పరస్పరం కలబడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో పాటు గంగవరం పోర్టు ఫైర్ సిబ్బంది, సెక్యూరిటీ స్టాఫ్ అంతా కలిసి కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. గంగవరం పోర్టు దగ్గర హైటెన్షన్ నెలకొంది.