Heavy Temperatures Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే.. రోడ్లు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వడదెబ్బతాకి ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో వృద్ధులు మృతి చెందారు. ఇక నేడు, రేపు ఇరు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు.. వడగాలులు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
గురువారం తెలంగాణలోని నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు ఏపీలోనూ 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో నంద్యాలజిల్లా యాగలబకంకిలో 44.1 డిగ్రీలు, కడప జిల్లా చిన్న చెప్పల్లిలో 43.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read: వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం.. కొవ్వూరు ప్రజాగళంలో చంద్రబాబు..
వైఎస్సార్ కడప, కర్నూల్, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకూ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 44 డిగ్రీల వరకూ.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో బయటకు రావొద్దని తెలిపింది.