Viveka Murder Case News(Andhra Pradesh News) : వైఎస్ వివేకా హత్యకేసులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్ పై గురువారం తెలంగాణ హైకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా మరికొందరి వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో మంగళవారం వివేకా కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్రెడ్డి వాంగ్మూలాలను సేకరించింది. బుధవారం మరో నలుగురు వ్యక్తులను విచారించింది.
వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామునే ఘటనాస్థలికి వెళ్లిన ఇనయతుల్లాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇనయతుల్లాను బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారించారు. ఇనయతుల్లా.. వివేకానందరెడ్డి వద్ద చాలా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేశారు. విధుల కోసం రోజూ తెల్లవారుజామునే వివేకా ఇంటికి వెళ్లేవారు. హత్య జరిగిన రోజూ యథావిధిగానే విధులకు వెళ్లారు. అప్పటికే వివేకా హత్య జరిగినట్లు తెలియడంతో మృతదేహం ఫొటోలను వాట్సాప్ ద్వారా వివేకా కుటుంబసభ్యులకు పంపించారు. ఈ విషయంపై ఇప్పటికే సీబీఐ అతడిని విచారించింది. తాజాగా మరోసారి వాంగ్మూలం సేకరించింది.
కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం మెకానికల్ విభాగంలో మేనేజర్లుగా పనిచేస్తున్న టి. చంద్రశేఖర్రెడ్డి, వెంకటరాజేశ్, రాజులను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉదయ్కుమార్రెడ్డి ఆ కర్మాగారంలోనే పని చేస్తున్నాడు. వివేకా హత్య జరిగిన రోజు విధులకు హాజరుకాకున్నా హాజరైనట్లు దస్త్రాల్లో నమోదు చేశారని ఆరోపణలున్నాయి. దీంతో హత్య జరిగిన రోజు అంతకు ముందు రెండురోజులు ఉదయ్కుమార్రెడ్డి విధులకు హాజరయ్యాడా..? హత్యానంతరం కర్మాగారానికి వచ్చాడా? అన్న వివరాలను మేనేజర్ల ద్వారా సేకరించారు. మరోవైపు ఉదయ్కుమార్రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజులపాటు పొడిగించింది.