Chandrababu Interim Bail : టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతుల విషయంలో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఐదు షరతులతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరు చేసే సమయంలో హైకోర్టు విధించిన ఐదు షరతులకు అదనంగా మరిన్ని షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పాత షరతులు చాలు.. కొత్తవి వద్దంటూ తీర్పు వెలువరించింది. చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీల నిత్యం పర్యవేక్షించాలన్న సీఐడీ విజ్ఞప్తిని అంగీకరించలేదు. చంద్రబాబు రాజకీయ ప్రసంగాలు చేయకూడదు.. ర్యాలీల్లో పాల్గొనకూడదు.. కేసు గురించి ఎటువంటి విషయాలు ఇతరులతో మాట్లాడకూడదని మరోసారి తెలిపింది.
కాగా.. శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. కంటి పరీక్షల నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఏఐజీ ఆస్పత్రిలో పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఏఐజీకి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కె.రాజేష్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం చంద్రబాబుకు వివిధ వైద్య పరీక్షలు సూచించారు. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేశారు. చంద్రబాబు శుక్రవారం ఏఐజీ నుంచి నేత్ర పరీక్షల కోసం జూబ్లీహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థకు వెళ్లనున్నారు. అక్కడే క్యాటరాక్టు సమస్యకు వైద్యులు శస్త్రచికిత్స
చేయనున్నారు.