Border Bridge Collapses in AP: తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచికొడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు. వంకలు పొంగిపొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. కాగా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయరహదారిపై బ్రిడ్జి కోతకు గురైంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ప్రదీహానికి రహదారి కోతకు గురైంది. దీంతో రెండువైపులా వాహనాల రాకపోకలు సాగించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక అధికారులతోపాటు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. బ్రిడ్జిపై ప్రయాణించకుండా వాహనాలను అడ్డుగా పెట్టారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
పాలేరు జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నది ప్రవాహానికి కూసుమంచి వద్ద జాతీయ రహదారి ధ్వంసం కావడంతో పాటు ఖమ్మం, హైదరాబాద్ జాతీయరహదారి కొట్టుకుపోయింది. అలాగే, ఐతవరం, కోదాడ రామాపురం క్రాస్ వద్ద జాతీయరహదారిపై వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నార్కెట్ పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచిస్తున్నారు.
మరోవైపు, వరదల ప్రభావం ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ విజయవాడ మార్గంలోని జాతీయరహదారి 65ను అధికారులు మూసేశారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణికులు..హైదరాబాద్, చౌటుప్పల్, చిట్యాల్, నార్కెట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన ప్రయాణికులు..హైదరాబాద్, చౌటుప్పల్, చిట్యాల్, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మరిపెడ బంగ్లా మీదుగా ఖమ్మం చేరుకోవాల్సి ఉంటుంది.
Also Read: విజయవాడ వరదలు మూడు లక్షల మందిపై ప్రభావం..
ఇదిలా ఉండగా, పాలేరు జలాశయం ప్రస్తుతం నీటిమట్టం 25.6 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు మాత్రమే.. అయితే ఈ స్థాయిని దాటి వరద ప్రవహిస్తోంది. దాదాపు 65వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారు. మళ్లీ ఈనెల 6, 7 వ తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడంన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు వణికిపోతున్నారు.