Godavari flood latest news telugu(Telugu flash news): గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. తెలంగాణతోపాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద వేద భారతి పీఠం శివలింగాలు నీటమునిగాయి. బాసర మండలంలోని బిద్రేల్లి వద్ద వరద ఉద్ధృతికి బైంసా-నిజామాబాద్ జాతీయ రహదారి కోతకు గురైంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటింది.
ఏలూరు జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి బాధితులను అధికారులు బోట్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి బేసిన్ ఎగువ పరీవాహక ప్రాంతాలు కుక్కునూరు, వేలేరుపాడు మండల పరిసరాల్లో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీ వద్ద గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.30 అడుగులకు చేరుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలోని లంక గ్రామాల ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. ముమ్మిడివరం మండలంలో 10, ఐ. పోలవరం మండలంలో 12, కాట్రేనికోన మండలంలో 4, తాళ్లరేపు మండలంలో 4 లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ 30 గ్రామాలు ముంపు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
గౌతమి గోదావరిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. రాజోలు పరిధిలోని వశిష్ఠ గోదావరికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. కొత్తలంక కాజ్వే పైకి వరద నీరు చేరింది. దీంతో లంకగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్పనపల్లి వద్ద వైనతేయ నదీపాయ కాజ్వే పైకి వరద ప్రవాహం చేరింది.