Viveka Murder Case Updates : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తుదిపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను ఆమె తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తున్నారా అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించగా..అవునని సిద్ధార్థ లూథ్రా సమాధానమిచ్చారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వివరణతో కూడిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. తాము దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారం విచారణకు స్వీకరించాలని కోరారు. లేదంటే ఆ పిటిషన్ వృథా అవుతుందన్నారు. దీంతో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఈ పిటిషన్ ను శుక్రవారం లిస్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ పై విచారణ జరిగింది.
అవినాష్రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల దర్యాప్తు ప్రక్రియ దారి తప్పే ప్రమాదం ఉందని సునీతా రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 30లోపు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. దీంతో కుట్రకోణంపై సీబీఐ దర్యాప్తు జరుపుతోందని.. ఇంత కీలకదశలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వల్ల దర్యాప్తు దారితప్పే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన పిటిషన్లు సాధారణంగా జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ముందు విచారణకు వచ్చేవి. శుక్రవారం ఆ ధర్మాసనం అందుబాటులో లేకపోవడంతో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు లిస్ట్ చేశారు.
మరోవైపు మూడో రోజూ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా మూడో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.