Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్పై నేడు తెలంగాణ హైకోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. న్యాయస్థాన గురువారం కూడా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అవినాష్రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్రెడ్డి , సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరపున పీపీ నాగేంద్ర వాదనలు వినిపించారు.
ఇప్పటి వరకు ఈ కేసులో CBI రెండు ఛార్జ్షీట్లు వేసిందని… కానీ రిమాండ్ రిపోర్టులో ఎక్కడా అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి పేర్లు ప్రస్తావించలేదని అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సమయంలో ఎవరినైనా అరెస్ట్ చేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎవరిని అరెస్ట్ చేయలేదని అవినాష్ తరపు న్యాయవాది బదులిచ్చారు. వెంటనే జోక్యం చేసుకున్న సునీత తరపు న్యాయవాది… అఫిడవిట్లో వారి పేర్లను ప్రస్తావించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరిని CBI రెండు నెలలపాటు కస్టడీకి తీసుకుందని.. అది ముగియగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే సీబీఐ ఎక్కడా అపోజ్ చేయలేదని అవినాష్రెడ్డి తరపు లాయర్ వాదించారు. సీబీఐ అధికారులు దస్తగిరిని ప్లాన్ ప్రకారం అవినాష్రెడ్డి పేరు చెప్పేలా చేశారని… ఆ తర్వాత అప్రూవర్గా మార్చారని తెలిపారు. దస్తగిరి మొదట ఇచ్చిన స్టేట్మెంట్లో కేవలం గంగిరెడ్డి సహా ఐదుగురి పేర్లను మాత్రమే చెప్పారని.. తర్వాత ఇచ్చిన మరో స్టేట్మెంట్లో కొత్త పేర్లను తెరపైకి తెచ్చారని న్యాయస్థానానికి దృష్టికి తీసుకెళ్లారు. అవినాష్రెడ్డిని అనుమానించ దగ్గ ఆధారాలు సీబీఐ వద్ద లేవని… కేవలం దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేకౌట్ పైనే సీబీఐ ఆధారపడుతోందని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏ కోర్టు కూడా గూగుల్ టేక్ఔట్ను ఆధారంగా పరిగణించదన్నారు.
వివేకా కుమార్తె సునీత తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. రక్తపు మడుగులో మృతదేహం కనిపిస్తుంటే గుండెపోటు అనడం ఆశ్చర్యకరమన్నారు. అవినాష్రెడ్డిపై ఎలాంటి కేసులు లేవన్న మాటలు అవాస్తవమని.. అతనిపై హత్యాయత్నం లాంటి కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో కూడా పొందుపరిచారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు…. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 5లోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సీబీఐకి సూచించింది.