సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో తెలుసా? ఆపదలో ఆదుకోవాల్సిన వాడే.. కోరిక తీర్చమంటే.. వాడి కోరలు ఎలా పీకెయ్యాలో తెలుసా? అన్నమయ్య జిల్లాలో ఓ అభాగ్యురాలిని చూసి తెలుసుకోవచ్చు.
ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడుకు చెందిన ఓ మహిళ.. తన కూతురు కనిపించకుండా పోయిందని పోలీసుల్ని ఆశ్రయించారు. యువతిని వెతికే బాధ్యతను హెడ్ కానిస్టేబుల్ దాసరి భాస్కర్కు, మహిళా కానిస్టేబుల్ రేవతికి అప్పగించారు స్టేషన్ ఎస్సై. ఇంతవరకు బాగానే ఉన్నా.. బాధితురాలి నిస్సహాయతను గుర్తించి కామాంధుడిగా మారిపోయాడు భాస్కర్. రేవతి కూడా తాను మహిళను అనే విషయాన్ని మర్చిపోయి హెడ్ గారికి మధ్యవర్తిగా మారిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
భాస్కర్ కోరిక తీరిస్తే మీ కూతురిని వెతికి పట్టుకుంటామంటూ బేరం పెట్టారు. ఖాకీలే కీచకుడిగా మారిపోవడంతో బాధితురాలికి ఏం చేయాలో పాలుపోలేదు. తన బాధను, ఆవేదనను ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. దీనిపై బిగ్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ దాసరి భాస్కర్పై చర్యలు తీసుకున్నారు.
హెడ్కానిస్టేబుల్ భాస్కర్ను తక్షణం విధుల నుంచి తప్పిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణా రావు ఆదేశాలు జారీ చేసారు. తనను వేధించడంలో భాస్కర్కు లేడీ కానిస్టేబుల్ రేవతి సహకరించినట్టు బాధితురాలు చెప్తున్నారు. ఆమెపైనా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. రెండు నెలల క్రితం జరిగిన ఘటన సోషల్ మీడియా ద్వారా మెయిన్స్ట్రీమ్ మీడియాకు చేరడం, ఓ హెడ్డు గారి సస్పెన్షన్కు దారితీయడం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసు సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఖాకీ యూనిఫాం ఉంది కదా అని సామాన్యులను వేధిస్తే ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వస్తుందనే సంకేతాలు వెళ్లాయి.