GVL Narasimha Rao | వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ విశాఖ నుంచి పోటీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉబలాట పడిపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ విశాఖ నుంచి పోటీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉబలాట పడిపోతున్నారు. ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించని ఆయన .. మీడియాలో మాత్రం తెగ డిబేట్లు చేస్తుంటారు. ఏపీ వాసి అయిన ఆయనకు ఆ వాగ్దాటి చూసే బీజేపీ పెద్దలు రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు లోక్సభలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న జీవీఎల్ వైజాగ్పైనే మనసు పడటానికి కారణం ఏంటి? అసలు ఏ లెక్కలతో ఆయన పోటీకి సిద్దమవుతున్నారు?
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు.. ఏపీ పాలిటిక్స్లో ఆ పేరు సుపరిచితమే. మీడియాలో అనర్గళంగా మాట్లాడేస్తూ ఏపీలో బానే పాపులర్ అయ్యారాయన. జీవీఎల్ పుట్టింది ప్రస్తుత బాపట్ల జిల్లా బల్లికురువ గ్రామంలో. ఆయన తండ్రి ముప్పై ఏళ్ళు పంచాయితీ సర్పంచ్ గా పని చేశారు. అదే జీవీఎల్కి రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసిందంటారు. జీవీఎల్ ఉన్నత చదువులు కూడా గుజరాత్లో కొనసాగాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న జీవీఎల్ కొన్నేళ్లుగా బీజేపీలోకి కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. జీవీఎల్ వాక్ చాతుర్యం, పట్టుదల చూసిన అధిష్టానం 2018 మార్చిలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. అప్పటి నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ ఖాళీ దొరికితే చాటు వైజాగ్లో వాలి పోతుంటారు.
ఉత్తర్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నా .. గత కొన్నేళ్లుగా జీవీఎల్ విశాఖ చుట్టే తిరుగుతున్నారు. బీజేపీ కార్యక్రమాలతో పాటు తన సొంత ఎజెండాతో మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతలా అంటే సిట్టింగ్ ఎంపీ ఫ్లెక్సీలు కన్నా .. విశాఖ నగరంలో జీవీఎల్ ఫ్లెక్సీలే ఎక్కువుగా కనపడుతుంటాయి. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నా ఎప్పటి నుండో విశాఖ ఎంపీ ఎన్నికల బరిలో దిగాలానే కోరిక ఉండటంతో ఫ్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటూ వస్తున్నారు. గత 20 ఏళ్లుగా విశాఖ ఎంపీలుగా నాన్ లోకల్ వ్యక్తులే గెలుస్తుండటంతో జీవీఎల్ విశాఖను సెలెక్ట్ చేసుకున్నారంట.
ఇప్పటి వరకు విశాఖ లోక్ సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారికే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి అన్ని పార్టీలు. 2004లో నేదురుమల్లి , 2009లో పురంధరేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవివీ సత్యనారాయణ. వీరంతా నాన్ లోకల్ లీడర్లే. ఆ లెక్కలతోనే 2024 ఎన్నికల్లో జీవీఎల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్దిగా ప్రకటించింది. బొత్స ఝాన్సీ రాజకీయ నేపథ్యం, భర్త బొత్స సత్యనారాయణ మంత్రి కావడం, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, బీసీ కులానికి చెందిన వాళ్ళు కావడంతో రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది.
మరోపక్క టీడీపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు అయిన భరత్ లైన్ లో ఉన్నారు. భరత్ కుటుంబం ఈస్ట్ గోదావరి నుండి వలస వచ్చినా ఎన్నో దశాబ్దాలుగా విశాఖలోనే ఉండటంతో నాన్ లోకల్ అన్న ప్రసక్తే లేదు. వైసీపీ, టీడీపీల అభ్యర్డులకు లోకల్ అనే ముద్ర ఉంది. అయితే నాన్ లోకల్ అయిన జీవీఎల్ విశాఖ ఎంట్రీ వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే .. 2014 ఎన్నికల్లో బీజేపీకి విశాఖ ఎంపీ సీటు ఇచ్చినట్లు .. ఈ సారి కూడా అక్కడ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలన్నది జీవీఎల్ ఆలోచనంట.. ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే .. తనకు బీజేపీలో ఉన్న పరిచయాలతో సీటు తెచ్చుకుందామని చూస్తున్నారంట.
అసలు జీవీఎల్ విశాఖనే ఎందుకు ఎంచుకున్నారు అనేదే ఇప్పుడు చర్చల్లో నలుగుతోంది. ముఖ్యంగా 2014 ఎన్నికల సరళి ఈసారి తనకి కలసి వస్తుందని జీవీఎల్ భావిస్తున్నారంట. ఇప్పటి వరకు గత 20ఏళ్లల్లో నాన్ లోకల్ అభ్యర్డులు గెలవడం, రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చు అనే అభిప్రాయం ఉండటం GVL ప్లాన్ గా తెలుస్తుంది. మరోపక్క విశాఖ నగరంలో నార్త్ ఇండియాకు చెందిన మార్వాడీలు, గుజరాతీస్, పంజాబీస్ ఎక్కువగా కనిపిస్తారు. వీళ్ళతో పాటు ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. వారంతా బీజేపీకి ఓటు వేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తున్నారాయన.
2014 ఎన్నికల్లో ఆయా వర్గాలకు చెందిన ఓటర్లు.. ముఖ్యంగా విశాఖ ఉత్తరం నియోజకవర్గంలోని వారు. మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేసి బీజేపీ అభ్యర్ధి అయిన కంభంపాటి హరిబాబును గెలిపించారు. ఇప్పుడు 2014 నాటి ఈక్వేషన్లు రిపీట్ అవుతాయన్న నమ్మకంతో జీవీఎల్విశాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏది ఎలా ఉన్నా రానున్న ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేయడానికి జీవీఎల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బీజేపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
GVL Narasimha Rao, Visakhapatnam MP seat, fight, YSRCP, Botsa Satyanarayana, Vizag,