Gurajala TDP | పల్నాడు జిల్లాలో పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. ఇప్పటికే వైసీపీ మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టింది.ఇక.. ప్రతిపక్ష తెలుగుదేశం కూడా వేగంగా పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు ప్రారంభించింది. పల్నాడు నాగమ్మరాజ్యంలో సీట్ల పంచాయితీ.. ఆ ప్రాంత పౌరుషాన్ని తలపిస్తోంది.
Gurajala TDP | పల్నాడు జిల్లాలో పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. ఇప్పటికే వైసీపీ మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టింది.ఇక.. ప్రతిపక్ష తెలుగుదేశం కూడా వేగంగా పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు ప్రారంభించింది. పల్నాడు నాగమ్మరాజ్యంలో సీట్ల పంచాయితీ.. ఆ ప్రాంత పౌరుషాన్ని తలపిస్తోంది.
పల్నాడులో కీలకమైన నియోజకవర్గం గురజాల. రాజకీయాల కంటే ఫ్యాక్షన్ విరాజిల్లే ప్రాంతంగా గుర్తింపు పొందింది. అలాంటి పౌరుషాల గడ్డలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులని రంగంలో దించాలంటే.. కొంత సాహసమనే చెప్పాలి. ఇప్పుడు అదే గురజాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా ఇద్దరు పోటీపడుతున్నారు. అందులో ఒకరు.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కాగా.. మరొకరు డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్.
వీరిద్దరూ గురజాల టీడీపీ సీటు కోసం పోటీపడుతున్నారు. ఇద్దరి బలాబలాలను చూస్తే.. యరపతినేని శ్రీనివాస్కు 30 సంవత్సరాల నుంచి ఇదే వియోజర్గవర్గంతో అనుబంధం ఉంది. ఇక్కడ నుంచే ఆయన ఆరుసార్లు పోటీ చేశారు. మూడు సార్లు గెలుపు, మూడు సార్లు ఓటమి చెందారు. పార్టీ క్యాడర్తోనూ ఆయనకు అనుబంధం ఎక్కువనే చెప్పొచ్చు. పైగా స్థానికులతో ఎక్కువ చనువు ఉండటంతో చాలా మందీ ఈయన నాయకత్వంవైపే చూస్తున్నారు. అధిష్టానం నుంచి కూడా శ్రీనివాసరావుకు పాజిటివ్ ధృక్పదం ఉంది. ఇదే సీటు కోసం పోటీపడుతున్న మరో అభ్యర్థి.. డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్. ఈయన తండ్రి కూడా తొలినుంచీ టీడీపీలో ఉన్నారు. 2009, 2014 లో టిక్కెట్ ఆశించిన శ్రీనివాస్కు భంగపాటు తప్పలేదు. ఇప్పుడు.. ఇద్దరూ 2024 టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు.
గురజాల తెలుగుదేశం అభ్యర్థిగా.. ఈ ఇద్దరి పేర్లూ వినపడటంతో ఒకింత ఉత్కంఠ నెలకొంది. టికెట్ ఎవరికి దక్కేనో అనే తెలుగు తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు. సీనియర్ నేతగా యరపతినేని శ్రీనివాసరావు పేరే బలంగా వినిపిస్తోంది. అయితే.. పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్తో తరచూ.. యరపతినేనితో పాటు చల్లగుండ్ల కూడా కలుస్తుండటం వల్ల.. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో సీనియర్ నాయకుడుగా పేరున్న యరపతినేనికి.. అపార అనుభవం ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన..ప్రతి గ్రామంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ అధిష్టానం వద్ద తనకంటూ ఓ ఇమేజ్ కూడా ఉంది. అధికారం లేకపోయినా… పార్టీకి, కార్యకర్తలకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ఇప్పటికే అధిష్టానానికి… గురజాల అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నానంటూ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తనదైన శైలిలో అన్ని విధాలుగా దూసుకుపోతున్నారు.
మరోవైపు… డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్కు కూడా మంచి పేరుంది. గురజాల కేంద్రంగా శ్రీకాంత్ నర్సింగ్ హోమ్ ప్రారంభించిన ఆయన.. వైద్య సేవ అందిస్తున్నారు. టీడీపీ పార్టీ కోసం పనిచేస్తూనే.. కార్యకర్తలకు పలు దఫాలుగా వైద్య సేవలూ అందించారు. పార్టీ కష్టకాలంలో నేను సైతం అంటూ ఉన్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారు. పార్టీకి విధేయుడుగా ఉంటూ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్తో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. యువగళం పాదయాత్రకి బాసటగా నిలిచారు. 2007లో చల్లగుండ్ల ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి… పల్నాడులో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గురజాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా చల్లగుండ్ల రేసులో ఉన్నారు. జిల్లాలో ఇద్దరు, ముగ్గురు సీనియర్ నాయకులతో పాటు NRIలు,పల్నాడులో ఉన్న పలువురు రాజకీయ పార్టీలతో పాటు వైద్యులంతా చల్లగుండ్లకు మద్దతు పలుకుతున్నారు.
యరపతినేని శ్రీనివాసరావుని నరసరావుపేట ఎంపీగా పంపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. చల్లగుండ్ల శ్రీనివాస్కి లైన్ క్లియర్ అవుతుంది. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా… టిక్కెట్ ఎవరికి అని చెప్పకుండా.. ఇరువురు నేతలతూ భరోసా ఇస్తున్నారు. దీంతో.. మరింత సస్పెన్స్ నెలకొంది. అధిష్టానం చెప్పినట్లు యరపతినేని ఎంపీగా పోటీకి ఒప్పుకుంటారా… గురజాలతో ఉన్న అనుబంధంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటారా అనేది ఉత్కంఠగా మారింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే కొన్ని సర్థుబాట్లు తప్పదని ఇప్పటికే అధినేత చంద్రబాబు.. పలుమార్లు నేతలకు సూచించారు. అధికారం కోసం కాకుండా.. రాష్ట్రాన్ని సరిచేసుకునేందుకు పనిచేయాలంటున్న అధినేత.. ఈ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.