Guntur : గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వల్ల వివాదం చోటు చేసుకుంది. ‘పోరంబోకు భూమిని కాపాడు జగనన్నా’ అంటూ వైకాపా నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది.
Guntur : గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదాస్పదం అయ్యింది. ‘పోరంబోకు భూమిని కాపాడు జగనన్నా’ అంటూ వైసీపీ నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో నల్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర ఉద్రిక్తత సృష్టించింది. ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవానికి మంగళవారం సీఎం జగన్ నల్లపాడుకు వచ్చారు. జగన్ పర్యటనను స్థానిక యువత, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఆడుదాం ఆంధ్ర సరే ..ఆట స్థలాలు ఎక్కడ’’ అని నినాదాలు చేస్తూ గుంటూరు చుట్టుగుంట జంక్షన్ లో ఆందోళనకు దిగారు.
రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడా పోటీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ప్రారంభించారు. మంగళవారం నుంచి ఫిబ్రవరి 10 వరకు మొత్తం 47 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించే ఈ పోటీలలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ మొదలైన ఆటలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.