AP Group 2 Exam Today(Andhra news updates): ఏపీలో గ్రూప్ – 2 ప్రాథమిక పరీక్ష (Prelims) నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులకు గాను.. 4లక్షల 83 వేల 525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా ప్రధాన కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ మాదిరిగానే ఆఫ్ లైన్ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల సమయంలో ఓఎంఆర్ షీట్ పై సమాధానాలను బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు మొత్తం 1327 కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా.. 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 850 మంది ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాల వారీగా 24 మంది ఐఏఎస్ అధికారులకు పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. పరీక్ష కేంద్రాల వద్ద 3,971 మంది పోలీసులను బందోబస్తుగా నియమించారు. మరో 900 మంది పోలీసులను ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల తరలింపుకు నియమించారు.
Read More : మంగళగిరి ఎయిమ్స్.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు కనీసం 60 నిమిషాల ముందు.. పరీక్ష గదిలోకి 30 నిమిషాల ముందు చేరుకోవాలి. 10.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష సమయం పూర్తయ్యేంతవరకూ అభ్యర్థులు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. మీ హాల్ టికెట్ నంబర్, పేరు వగైరా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
మొబైల్స్, క్యాలిక్యులేటర్లు, ఐప్యాడ్ లు, బ్లూటూత్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పరీక్షకు అవసరమైన పెన్నులు, స్టేషనరీ వస్తువులను మీ వెంట తీసుకెళ్లాలి. అలాగే హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా ఉండాలి.
మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని ఏపీపీఎస్సీ సభ్యుడు సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఒక్కసారి డీబార్ అయితే 5 -10 సంవత్సరాల వరకూ ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి పరీక్షలకూ అర్హులు కాలేరన్నారు.