AP Anganwadi Protest : అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఆందోళన విరమించి.. విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో ముగియడంతో చర్యలకు సిద్ధమైంది జగన్ సర్కార్. ప్రభుత్వ డెడ్లైన్ను పట్టించుకోకుండా ఆందోళన కొనసాగిస్తున్న అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్ జవహర్రెడ్డి.
ఎస్మా చట్టం కింద అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు జారీచేసినా విధుల్లో చేరకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. నోటీసుల గడువు పూర్తికావడంతో.. ఇప్పటికీ విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని కలెక్టర్లకు సూచించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదదర్శి జవహహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు.
సీఎస్ ఆదేశాలతో చర్యలకు సిద్ధమయ్యారు కలెక్టర్లు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు కలెక్టర్లు సిద్ధమయ్యారు. విధులలో చేరని అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలగించిన వారి ప్లేస్ లో కొత్తవారిని నియమించేందుకు ఈ నెల 25న కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో సమ్మెలో పాల్గొంటూ.. విధులకు హాజరుకాని కార్యకర్తలు మొత్తం 1444, ఆయాలు 931 మంది ఉన్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా మహిళా శిశుసంక్షేమ అభివృద్ధి అధికారి ఎం.ఎన్. రాణి వెల్లడించారు. విజయనగరం జిల్లా పరిధిలో 4151 మంది అంగన్వాడీలు సమ్మెలో పాల్గొనగా.. 503 మంది తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపారు. మిగతా వారిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వివరించారు.