Government Employees : ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంతో తాడే పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తమకు సకాలంలో జీతాలు చెల్లించడంలేదని ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కర్నూలులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల కోసం సన్నాహక సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. తమకు రావాల్సిన బకాయిలనే అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదన్న విమర్శలకు సమాధానమిచ్చారు. ఉద్యమం వస్తే అందరం కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని బొప్పరాజు కోరారు. ఉద్యోగుల డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. గతంలో పండగ సమయాల్లో ముందే జీతాలిచ్చేవారని గుర్తు చేశారు. ఇప్పుడు జీతాలు ఇవ్వండని అడిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం రావాల్సినవి కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. కొత్త జీవోల ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు.
సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని సీఎం జగన్ ను ఉద్దేశించి బొప్పరాజు విమర్శలు చేశారు. ఎవరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వట్లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ అలవెన్సులు ఇవ్వలేదన్నారు. ఒప్పంద ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ ఆవేదనను ఎన్ని కమిటీలకు చెప్పినా ఫలితం ఇంతవరకు లేదన్నారు. కరోనా బారినపడి ఎందరో ఉద్యోగులు చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రిటైర్మెంట్ బెన్ఫిట్లు చెల్లించట్లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న సూర్యనారాయణ, నేడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇలా ఉద్యోగ సంఘాల నేతలు జీతాల కోసం నేరుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెడుతుందా? ఉద్యోగులతో చర్చలు జరిపి వారిని చల్లార్చుతుందా? లేదంటే ఉద్యోగుల ఆందోళన బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.