CM jagan : త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని, ఏపీ పరిపాలనా విభాగమంతా విశాఖకు మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ లోగానే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు మరోసారి జగన్ స్పష్టం చేశారు. విశాఖ నుంచే రాష్ట్ర పాలన జరుగుతుందని జగన్ వెల్లడించారు. సోమవారం విశాఖ రిషికొండలో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. విశాఖ త్వరలోనే ఐటీ హబ్ గా మారుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖపట్నమని.. ఐటీ పరంగా ఇది హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు.
వైజాగ్ లో ఉద్యోగులకు, కంపెనీలకు విస్తారమైన అవకాశాలున్నాయన్న జగన్.. ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తానని కంపెనీలకు హామీఇచ్చారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని, ప్రతి ఏటా 15 వేల మంది ఇంజినీర్లు తయారవుతున్నారని తెలిపారు.ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా తయారైందన్నారు. అనంతరం ఇన్ఫోసిస్ అధికారులు మాట్లాడుతూ.. ఏపీలో హైబ్రీడ్ వర్కింగ్ మోడల్ లో 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఏపీలో ఐటీ నిపుణులకు కొదవలేదని వారు అభిప్రాయపడ్డారు.