Gold Seize : ఒకటి కాదు రెండు.. పది కాదు 20 కాదు ఏకంగా 300 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. నాలుగు గోల్డ్ షాపుల్లో బిల్లులు లేని 300 కిలోల బంగారాన్ని గుర్తించారు.ఆ గోల్డ్ ను సీజ్ చేశారు.
విజయవాడ,తిరుపతికి చెందిన ఐటీ అధికారులు 4 రోజులుగా ప్రొద్దుటూరులో సోదాలు నిర్వహించారు. బుశెట్టి జువెలర్స్, డైమండ్స్ , గురురాఘవేంద్ర, తల్లం షాపుల్లో తనిఖీలు చేశారు. బిల్లులు లేని బంగారాన్ని సీజ్ చేశారు. ఆ బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్కేసుల్లో భద్రపరిచారు. ఆ తర్వాత వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఆయా షాపుల యజమానులు బిల్లులు లేకుండా భారీగా గోల్డ్ ను దిగుమతి చేసుకున్నారని ఐటీ అధికారులు నిర్ధారించారు.
బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు పెట్టింది పేరు. రెండో ముంబైగా ఖ్యాతి గాంచింది. ఇక్కడ 2 వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల షాపులున్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నోఏళ్లుగా గోల్డ్ వ్యాపార లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమంగా బంగారం దిగుమతి జరుగుతోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న అధికారుల 4 దుకాణాల్లో సోదాలు చేపట్టారు.
ఐటీ అధికారుల సోదాలతో ప్రొద్దుటూరులోని బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో చాలామంది వ్యారులు బంగారం దుకాణాలను మూసివేశారు. దసరా పండుగ సమయంలోనూ బంగారం దుకాణాలన్నీ మూత పడ్డాయి. దీంతో బంగారం కొనేందుకు షాపుల వద్దకు వచ్చిన వినియోగదారులు నిరాశగా వెనుదిరిగారు.