Global Investors Summit : విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సదస్సును ప్రారంభించారు. రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమార మంగళం బిర్లా, టాటా గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల సదస్సులో పాల్గొన్నారు.
తొలిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చర్చాగోష్ఠులు జరుగుతాయి. వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై పారిశ్రామికవేత్తలు చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు బీచ్రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఇక్కడ ఆంధ్రా వంటకాలను అతిథులకు వడ్డిస్తారు.
శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పెట్టుబడులపై ఒప్పందాలు జరుగుతాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు మొత్తం 26 దేశాల నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సమ్మిట్ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగిస్తారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ముగుస్తుంది.