AP Municipal Workers: ఏపీలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి, నందిగామ మున్సిపాలిటీల్లో కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. మున్సిపల్ అధికారులకు.. కార్మికులకు మధ్య తోపులాట జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టడంతో వీధుల వెంట చెత్త పేరుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రైవేటు సిబ్బందితో పారిశుద్ధ్య పనులను నిర్వహించడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొండపల్లి, నందిగామ మున్సిపల్ కార్యాలయాల నుంచి చెత్త తరలించే వాహనాలను బయటకు తీసుకెళ్ళేందుకు.. మున్సిపల్ అధికారులు యత్నించారు. దీంతో వాటి టైర్లలో గాలితీసి.. పారిశుద్ధ్య కార్మికులు ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కార్మికుల నిరవధిక సమ్మె దీక్షా శిబిరం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.
కొండపల్లిలో దీక్షా శిబిరం వద్దకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పోలీసులు చేరుకున్నారు. రెండ్రోజుల పాటు విధుల్లో పాల్గొనాలని కార్మికులను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. నిరవధిక సమ్మె కనుక రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మేము విధుల్లో పాల్గొనమని కార్మికులు తేల్చిచెప్పారు. చెత్తను తరలించే వాహనాలను తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక కార్మికులకు నచ్చజెప్పేందుకు అధికారులు, పోలీసులు యత్నించారు. కార్మికులు మాట వినకపోవడంతో చెత్తను తొలగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని కార్మికులు సమ్మె చేస్తుండడంతో వీధుల వెంట చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.