టీడీపీ నేతగా ఎదిగారు. తర్వాత ఆ పార్టీ అధినేతతో పాటు ఆయన కుమారుడిని ఎగతాళి చేశారు. టీడీపీ నుంచి గెలిచినా.. అసెంబ్లీలో అధికార పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. నోటి వచ్చింది మాట్లాడి.. తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యారు. ఇంత చేసినా.. నమ్ముకున్న అన్న నోటినుంచి తన మాట ఎప్పుడూ రాలేదు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. దాని తోడు కొంతకాలంగా మౌనవ్రతం. అసలు ఏం జరుగుతుంది. ఎవరా నేత.. ఎందుకీ మౌనం.
వల్లభనేని వంశీ మోహన్.. ఈ పేరు.. ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం అంటే అతిశయోక్తి కాదు. పొలిటికల్ డైనమైట్ లాంటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. అదే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తనపై చేసే చిన్న విమర్శపై కూడా గట్టిగా రియాక్ట్ అయ్యే ఎమ్మెల్యే వంశీ.. కొన్ని రోజుల నుంచి ఎలాంటి సౌండ్ చేయడం లేదు. ఇటీవల టీడీపీలో చేరిన మాజీ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు విమర్శలు.. తర్వాత యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హెచ్చరికలపైనా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. ఎప్పుడూ పరుష పదాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వంశీ.. ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తున్నారా? అసలు వంశీ రాజకీయ వ్యూహం ఏమిటనే అంశంపై.. అన్నీ పార్టీల్లోనూ హాట్ టాపిక్గా మారింది.
కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలకు గన్నవరం కేంద్రంగా మారింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్గా తెలుగుదేశం అస్త్రాలు సంధిస్తోంది. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పై తరుచూ విరుచుకుపడే వంశీని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుంది టీడీపీ. సరైన.. సమర్థుడైన నేత కోసం ఇన్నాళ్లు గాలించింది. సరిగ్గా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లాలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే YCP నేత యార్లగడ్డ వెంకట్రావు… ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. దీంతో ఆయన టీడీపీ పాలిట ఆశాకిరణంగా మారారు.
గత ఎన్నికల్లో వంశీపై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ.. YCPకి రాజీనామా చేసే టైమ్లో తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అంటే అభిమానం ఉందని చెబుతూనే.. వంశీ కోసం తనకు అన్యాయం చేశారని వాపోయారు. వంశీపైనా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. తర్వాత గన్నవరం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది తెలుగుదేశం. నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో వంశీని… పిల్ల సైకోగా అభివర్ణించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని.. గుణపాఠం చెబుతామని గట్టి హెచ్చరికలు చేశారు లోకేశ్.
మామూలుగా అయితే.. వంశీ లోకేష్, యార్లగడ్డ మాటలకు కౌంటర్ ఇచ్చేవారే. కానీ.. ఆయన సైలెంట్గా ఉండిపోవటం పట్ల పలు అనుమానులు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొంతకాలంగా వంశీ… రాజకీయాలకి దూరంగా ఉన్నారా అని అనిపించే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు వార్తలో ఉంటే వ్యక్తి … అసలు పోటీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. సాధారణంగా చంద్రబాబు, లోకేశ్ విమర్శలపై వైసీపీలో ముందుగా రియాక్ట్ అయ్యేది మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఆయన తర్వాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అలాంటిది డైరెక్ట్ గా తననే టార్గెట్ చేసినా వంశీ పల్లెత్తు మాట మాట్లాడకపోవటంపై రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
టీడీపీ రెచ్చగొట్టినట్లు మాట్లాడినా రెచ్చిపోకుండా పరిణితి ప్రదర్శించానని చెప్పాలనుకుంటున్నారా.. లేక సమయం కోసం వేచి చూస్తున్నారా.. ఎమ్మెల్యే వంశీ రాజకీయ వ్యూహం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎమ్మెల్యే వంశీ సహజశైలికి భిన్నంగా కొంతకాలంగా వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. నియోజక వర్గంలో మంచి నేతగా పేరు ఉన్నా.. మాటల విషయంలో మాత్రం వంశీ.. ఎక్కువ చేస్తారనే వాదనలు ఉన్నాయి. పైగా టీడీపీ ద్వారా పేరు తెచ్చుకుని.. ఆ పార్టీ అధినేతతో పాటు ఆయన కుమారుడు లోకేష్పై తీవ్రవిమర్శలు చేసిన వంశీ.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఏ పార్టీ నుంచి నిలబడతారనే ఉత్కంఠ.. అందరిలోనూ నెలకొంది.
DP నుంచి YCPలోకి వచ్చిన నలుగు ఎమ్మెల్యేలకి జగన్ సీటిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే గుంటూరులో గిరికి ఇవ్వలేదు. చీరాలలో కరణం బలరాం పరిస్థితి అయోమయంలో ఉంది. విశాఖలో వాసుపల్లి గణేష్ సీటుపైనా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వారి సరసన ఉన్న వంశీ నెక్ట్స్ స్టెప్ ఏంటనే చర్చ సాగుతోంది. ఏమి జరుగుతోందో తెలియక.. వంశీ అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఆయన కూడా వైసీపీ సముచిత స్థానం ఇవ్వకపోతే.. ఏ పార్టీలోకి వెళ్లాలో అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇంత తిట్టిపోసిన టీడీపీ గూటికి వెళ్లలేక.. తెలుగుతమ్ముళ్లకు మెయిన్ టార్గెట్గా మారిన వంశీ.. ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.