Vijayawada : విజయవాడలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం బాధితురాలు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకుని జీవించే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్లో పని చేసే వ్యక్తి ఈ నెల 17న కానూరు సనత్నగర్లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ అతడితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో మూడు రోజులపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తీవ్ర అస్వస్థత గురైంది. ఆమె సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది.
ఆసుపత్రి వర్గాల సమాచారం ఇవ్వడంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. సోమవారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేరాల్లో ఎక్కువగా మహిళలే బాధితులుగా ఉంటున్నారు. ఏడాది క్రితం రేపల్లె రైల్వేస్టేషన్ లోనే ఓ మహిళ గ్యాంగ్ రేప్ కు గురయ్యారు. భర్త కళ్లేదుటే ఈ దారుణం జరిగింది. భర్తపై దాడి చేసి నిందితులు దారుణానికి పాల్పడ్డారు. అలాగే కొంతకాలం క్రితం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట విజయవాడ సమీపంలో ఓ బ్రిడ్జి కిందకు సరదాగా విహారానికి వెళ్లగా… దుండగులు దాడి చేశారు. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి.
ఇలాంటి ఘటనలు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో తరచూ జరుగుతున్నాయి. గంజాయి బ్యాచ్ లు ఈ దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలున్నాయి. అలాగే బ్లేడ్ బ్యాచ్ లు దోపిడిలకు తెగబడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో రేప్ లు, దొంగతనాలు ఎక్కువగా జరగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసులు తీరుపైనా ప్రజలు మండిపడుతున్నారు. నేరాల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు.