Gajuwaka Politics : విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. సోమవారం వైసీపీకి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఇప్పుడు ఈ రాజీనామా విషయంలో ట్విస్ట్ ఏర్పడింది. తాను వైసీపీకి విధేయుడిగా ఉంటానంటూ ఎమ్మెల్యే నాగిరెడ్డి స్పష్టం చేయడంతో రాజకీయం కొత్త మలుపు తిరిగింది.
గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా సోమవారం రామచంద్రరావును వైసీపీ నియమించింది. తన కుమారుడిని తప్పించి.. ఓ కార్పొరేటర్కు అవకాశం ఇవ్వడంపై నాగిరెడ్డి అలిగారని ప్రచారం జరిగింది. ఆయన తనయుడు దేవన్ రెడ్డి సోమవారం వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్రెడ్డి.. వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. చర్చల తర్వాత రాజీనామా విషయంలో వెనక్కు తగ్గారు.
ఒక్కరోజు వ్యవధిలో ఎమ్మెల్యే నాగిరెడ్డి స్వరం మారింది. తాము వైసీపీలోనే ఉంటామని తండ్రీకొడుకులు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తామని వైవీ సుబ్బారెడ్డిని కలిసి చెప్పారు. ప్రస్తుతం గాజువాక వైసీపీలో ముసలం ఇలా సద్దుమణిగింది.