Free Bus Scheme for Women: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్ల జగన్ సర్కారులో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందంటూ ఆయన మండిపడ్డారు. కారుణ్య నియామకాలపై చర్చించామన్న మంత్రి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంతో చర్చిస్తామంటూ ప్రసాద్ రెడ్డి చెప్పారు.
Also Read: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది: జగన్
రాష్ట్రంలో రేషన్, మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తామంటూ మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామన్నారు. ఆర్టీసీలో 7 వేల మంది సిబ్బంది కొరత ఉందని, వాటిని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఈ నెల 12న మరోసారీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలుపై సీఎం చర్చిస్తారని ఆయన చెప్పారు.