400 Young Stars Cheated name of Software Jobs: రాష్ట్రంలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి దాదాపు 400 మంది నిరుద్యోగ యువకులను మోసం చేశారు. వారి వద్ద నుంచి కోట్లలో కొట్టేశాడు. అనంతరం ఆ డబ్బుతో పరారయ్యాడు. దీంతో మోసపోయాం అని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు చెందిన యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అన్నమయ్య జిల్లా పీలేరు బండ్లవంక ప్రాంతానికి చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ అనే యువకుడు మోసం చేశాడు. భరత్ హైదరాబాద్, బెంగళూరుల్లో ఉంటూ నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తానని కొందరిని నమ్మించాడు. అనంతరం తను వచ్చిన రెజ్యూమ్ ల ఆధారంగా చేసుకుని వారికి కాల్స్ చేసేవాడు. నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల జీతం వచ్చే ఉద్యోగం రావాలంటే ముందుగా కొంత డబ్బులు డిపాజిట్ రూపంలో చెల్లించాలని చెప్పి నమ్మించేవాడు. అనంతరం వారి నుంచి డబ్బులు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. ఈ క్రమంలో రెండు నెలల పాటు వారందరికి భరత్ జీతాలు అందజేశాడు. ఆ తర్వాత భరత్ బోర్డు తిప్పేయడంతో.. తామంతా మోసపోయామని గ్రహించి.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
మోసానికి పాల్పడిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ స్వగ్రామం పీలేరు బండ్లవంక అని తెలుసుకున్న బాధితులు.. పీలేరు పోలీసులను ఆశ్రయించారు. నిరుద్యోగులు ఫిర్యాదుతో పీలేరు పోలీసులు భరత్ పై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఈ బాధితుల్లో హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని గుంటూరు, అనంతపురం, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైయస్ఆర్ జిల్లాల్లోని 400 మందికి పైగా నిరుద్యోగులు ఇతని చేతిలో మోసపోయినట్లు వారు గుర్తించారు.
Also Read: Jammalamadugu Ticket War : బాబాయ్ VS అబ్బాయ్.. ఆదినారాయణ ఫ్యామిలీలో జమ్మలమడుగు టికెట్ వార్
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ సుమారు 400 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసినట్లు పీలేరు పోలీసు యంత్రాంగం గుర్తించింది. సుమారు రూ. 10 కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మంచి జీతంలో హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అప్పులు తెచ్చి కట్టామని, మరి కొందరికి ష్యూరిటీ ఉండి డబ్బు కట్టించామని నిరుద్యోగులు పోలీసుల ముందు తమ గోడు వెల్లడించారు.
పీలేరు పోలీసులు భరత్ తండ్రిని స్టేషన్కు పిలిపించి.. భరత్ను వెంటనే పిలిపించాలని ఆదేశించారు. దీంతో ఆయన తన కొడుడు భరత్ కు ఫోను చేసినా స్పందించలేదు. ప్రస్తుతం పరారిలో ఉన్న భరత్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నేరం జరిగిన చోటే కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పీలేరు పోలీసులు బాధితులకు సూచించగా.. నిందితుడు భరత్ దొరికేంత వరకు పీలేరులోనే ఉంటామని వెల్లడించారు. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన భరత్ పట్టుబడ్డాకనే.. అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ ముఠాలో ఇంకా ఎంత మంది ఉన్నారో బయటపడుతుందని పోలీసులు తెలిపారు.