Venkaiah Naidu latest news: రాజకీయ నాయకులు బూతులు మాట్లాడితే వారికి పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ, పార్లమెంట్లలో కొంతమంది అపహాస్య పనులు చేస్తున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. అలాంటి వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని ఆయన హితవుపలికారు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారన్నారు. ఇటువంటి వారికి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పాలన్నారు. వ్యక్తికి చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమన్నారు. మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని ఆయన పేర్కొన్నారు.
మాతృభాష కళ్ళు లాంటిదని… పరాయి భాష కళ్లద్దాలు వంటిదని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారన్నారు. నేడు సమాజంలో విలువలతో కూడిన విద్య తగ్గుతుందన్నారు. ఇది దేశానికి, సమాజానికి మంచిది కాదన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడానికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. దేశంలో ఉన్న మేధాశక్తి వలన మరల ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోందన్నారు.
భగవంతుడు ప్రత్యక్షం అయ్యి ఏం కావాలని తనను అడిగితే మళ్లీ విద్యార్థి దశకు తీసుకెళ్లాలని కోరుకుంటానని వెంకటయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్క దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ మద్య ప్రతి చిన్న అంశానికి గూగుల్ పై ఆధారపడుతున్నారన్నారు. గూగుల్ గురువును మించింది కాదని ఆయన పేర్కొన్నారు.