Perni Nani Comments: కలియుగ వైకుంఠం లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం బీజేపీ వర్సెస్ వైసీపీ గా మారిందని చెప్పవచ్చు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని లడ్డు వివాదానికి సంబంధించి స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రధానంగా ఈ విమర్శలు తెలంగాణకు చెందిన బిజెపి నాయకురాలు మాధవీలతను ఉద్దేశించి కాగా.. బిజెపి రిప్లై ఎలా ఉంటుందోనన్న చర్చలు జోరందుకున్నాయి.
కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ.. వాటిని తిప్పికొట్టే చర్యలలో భాగంగా మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించి ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. ఆ సమయంలోనే తెలంగాణకు చెందిన మాధవీలత వందేభారత్ రైలులో తిరుపతికి వస్తూ గోవిందా.. గోవిందా అంటూ శ్రీవారి నామాన్ని జపిస్తూ భజన చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారాయి. అలాగే తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్లో నిలిచిన సమయంలో సైతం స్వామి వారి నామాన్ని జపించారు. అనంతరం వైసీపీ లక్ష్యంగా ఆమె విమర్శలు సైతం చేశారు. లడ్డు పవిత్రతపై సాక్షాత్తు సీఎం మాట్లాడడం సామాన్యమైన విషయం కాదని, వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందంటూ ఆరోపించారు. అలాగే తిరుమల పవిత్రత కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భాద్యులపై తప్పక చర్యలు తీసుకోవాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఇలా లడ్డు వ్యవహారంపై మాధవీలత చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు.
నాని మాట్లాడుతూ.. తెలంగాణ నుండి బిజెపి నాయకురాలు మాధవీలత భజన చేసుకుంటూ తిరుమలకు వచ్చారని, అది తన వ్యక్తిగత ప్రచార పర్వం కోసమే చేసినట్లుగా ఉందన్నారు. ఆమెకు హైదరాబాద్ లో వైద్యశాల ఉందని, ఆ భజన చేయాలని అనుకుంటే అక్కడే చేయాలన్నారు. మీ వైద్యశాలలో ఒక్క రోగికైనా ఫీజు తగ్గించి వైద్యం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఏ హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. కరోనా కాలంలో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. అంతటితో ఆగక అసలు ఏపీకి మాధవీలతకు ఉన్న సంబంధం ఏమిటి ? ఇక్కడి హిందువులు, మతాల గురించి ఆమె ఎందుకు మాట్లాడారు అంటూ స్పందించారు. ఇలా ఆమెకు కౌంటర్ ఇచ్చిన నాని.. కొంచెం సీరియస్ గానే మాధవీలత వ్యాఖ్యల పట్ల స్పందించారని చెప్పవచ్చు.
ఇలా లడ్డు వ్యవహారం పక్క రాష్ట్రమైన తెలంగాణకు తాకగా.. మాధవీలతతో పాటు బిజెపి సైతం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటి వరకు కూటమి వర్సెస్ వైసీపీలా ఉన్న ఈ వ్యవహారం.. చిన్నగా బీజేపీ వర్సెస్ వైసీపీలా మారింది. ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుండగా.. మరో వైపు పార్టీల మధ్య చిచ్చు రాజుకుంటోంది. అలాగే ప్రభుత్వం మాత్రం తిరుమల లడ్డు ప్రసాదం పవిత్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఇటీవల లడ్డు అమ్మకాలు సైతం ఎక్కువగా సాగుతున్న పరిస్థితి తిరుమలలో నెలకొంది. టీటీడీ అందించే ప్రతి ప్రసాదంలో నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.