Kuthuhalamma : మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఆమె నివాసంలో తెల్లవారుజామున మృతిచెందారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు.
వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. చిత్తూరు జిల్లా
పరిషత్ అధ్యక్షురాలిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మరో మూడుసార్లు 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జీడీనెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుతూహలమ్మ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి కేబినెట్ లో 1991-93 మధ్య వైద్యారోగ్య, శిశు, సంక్షేమశాఖ మంత్రిగా సేవలందించారు. 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీలో కుతూహలమ్మకు స్థానం దక్కింది. ఆమె ఏఐసీసీ సభ్యురాలుగా 1992 నుంచి 1997 వరకు పని చేశారు. సుధీర్ఘకాలం ఆమె కాంగ్రెస్ లో కొనసాగారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.