JD Laxminarayana : ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ అంశంపై స్పందించారు. మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అభివృద్ధితోనే సాధికారిత సాధ్యమవుతుందన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాలని ప్రభుత్వం చెబుతోందని, మరి రాయలసీమకు రాజధాని కావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని లక్ష్మీనారాయణ అన్నారు. దీని వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తుతాయన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేసినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభ సాక్షిగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ ప్రతి జిల్లాను అభివృద్ధి చేస్తే అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
విశాఖపట్నం జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ ఆంధ్రుడా మేలుకో ’ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు.
మహారాష్ట్ర మోడల్
మహారాష్ట్ర తరహాలో ప్రతి జిల్లాను అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తవని లక్ష్మీనారాయణ చెప్పారు. అక్కడ 22 ఏళ్లు పని చేసిన అనుభవాన్ని వివరించారు. మహారాష్ట్రలో అనేక పట్టణాలు వృద్ధి చెందాయని తెలిపారు. ముంబై, పుణే, థానే, ఔరంగాబాద్, నాగ్పూర్, నాసిక్ చుట్టూ ఎన్నో పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. అక్కడి ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు పెద్దగా వెళ్లరని తెలిపారు. ఏపీలో ఉద్యోగాలు లేక ఉపాధి కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెలుతోందన్నారు. ఏపీలో ప్రతి జిల్లాను మహారాష్ట్ర మాదిరిగా అభివృద్ధి చేస్తే ఎక్కడికీ వెళ్లాల్సిన గతి పట్టదని లక్ష్మీనారాయణ అన్నారు. మహారాష్ట్రలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ముంబయిలో , నాగ్పూర్, ఔరంగాబాద్లో రెండు బెంచ్లు ఏర్పాటు చేశారని తెలిపారు.
అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్, విశాఖ, కర్నూలులో బెంచ్లు ఏర్పాటు చేయాలని లక్ష్మీనారాయణ అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు విశాఖ, కర్నూలులో పెట్టుకోవచ్చని సూచించారు. ఒకే ప్రాంతంలో అన్ని కార్యాలయాలు ఉండే విధానం అన్ని రాష్ట్రాల్లో ఉందని, ఆ విధంగా ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించకూడదని లక్ష్మీనారాయణ అన్నారు.