Floating Bridge in Visakhapatnam(AP updates): విశాఖపట్నం పర్యాటకంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. నిత్యం వేలమంది సందర్శకులు నగరానికి వస్తున్నారు. సాగరతీరంలో ఆహ్లాదకరమై వాతావరణంలో ఉత్సాహంగా గడుపుతున్నారు. దీంతో ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, కైలాస గిరి, తోట్లకొండ, భీమిలి ప్రాంతాలు సందర్శకులకు సందడిగా ఉంటున్నాయి. బీచ్ పర్యాటకానికి వైజాగ్ కేరఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పుడు విశాఖలో మరొకటి అందుబాటులోకి వచ్చేసింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను తాజాగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా పాల్గొన్నారు.
వైజాగ్ ప్రశాంత నగరమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అందుకే సందర్శకులు ఎక్కువగా వస్తారని చెప్పారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి అందుబాటులోక రావడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.
ఏపీలో బీచ్ల అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచి పాలన కార్యక్రమాలు నడుస్తాయని వెల్లడించారు. త్వరలోనే విశాఖ పరిపాలన రాజధానిని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని ప్రకటించారు. టూరిస్టులను ఆకట్టుకునేలా వైజాగ్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద వైఎంసీఏ సమీపంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను నిర్మించారు. ఇందుకోసం కోటి 60 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. విశాఖ మెట్రోపాలిటన్ రీజయన్ డెవలప్ మెంట్ అథారిటీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పనులు చేపట్టింది. జనవరిలో పనులు మొదలయ్యాయి. రెండునెలల లోపే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎగసిపడే సముద్ర అలలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది.