పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంపై కుటంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం కాదని.. పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి అంతమొందించాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కుటుంబ సభ్యులు. కావాలనే రాంగ్ రూట్లో వచ్చి.. ఉద్దేశపూర్వకంగానే యాక్సిడెంట్ చేసి సాబ్జీని హత్య చేశారని చెబుతున్నారు.
భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్సీ సాబ్జీ.. ఏలూరు నుంచి తన వాహనంలో వెళ్లారు. తిరిగి భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తుండగా ఉండి మండలం చెరుకువాడ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన కారు డ్రైవర్, గన్మెన్, పీఏ తీవ్రంగా గాయపడ్డారు.
అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. కావాలనే కుట్ర చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సాబ్జీపై కుట్రపన్నారని చెబుతున్నారు. 140 కిలో మీటర్ల వేగంతో వాహనం వచ్చి కారును ఢీకొట్టినట్లు పోలీసులే చెబుతున్నారని..తన తండ్రిది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని ఎవరో కుట్రపూరితంగా పథకం ప్రకారమే చేసి ఉంటారని ఆరోపించారు. మృతదేహానికి పోస్ట్మార్టం చేసి బయటికి తీసుకువచ్చాక కూడా రక్తం కారుతోందని.. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యేనన్నారు. తన తండ్రి ఎమ్మెల్సీ అయినా పోస్టుమార్టం కూడా సక్రమంగా చేయలేదని.. ప్రమాదానికి కారణమైన వారిని తప్పించేలా పోలీసుల విచారణ ఉందని ఆరోపించారు కుటుంబ సభ్యులు.
ప్రమాదానికి కారణమైన కారు నంబర్ చెప్పారే తప్ప.. ప్రమాదానికి కారకులైన వారి వివరాలు మాత్రం ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కారు నంబర్ వెల్లడించారు కానీ నిందితులు ఎక్కడికి వెళ్లారు. ఎంత మంది ఉన్నారు అనేది మాత్రం ఎందుకు వెల్లడించడంలేదని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ పక్కన ఉన్న తన తండ్రి మాత్రమే చనిపోయేలా.. ప్లాన్ ప్రకారమే తప్పుడు మార్గంలో వచ్చి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం కలుగుతోందన్నారు సాబ్జీ కుమారుడు ఆజాద్.
ప్రమాదానికి కారణమైన వారిని వదిలిపెట్టిన ఎవరో అనామకుడిని నిందితుడిగా చూపిస్తే ఎలా నమ్మాలంటున్నారు. తమ తండ్రి మృతిపై అనుమానాలున్నాయని చెబుతున్నా.. పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారని.. ఇందేటని ప్రశ్నిస్తే మరో ఫిర్యాదు ఇవ్వాలనడం ఏంటో అర్ధం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ సాబ్జీ కుటుంబ సభ్యులు. ఘటనపై సీబీ సీఐడీతో నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహాన్ని భీమవరం ఆస్పత్రికి తరలించిన తర్వాత. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్.. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని విచారణ ప్రారంభించారు.