Fake Publicity on BigTV in Social Media: ప్రారంభమైన కొద్ది నెలలకే విలక్షణమైన వార్తా కథనాలతో.. తెలుగు రాష్ట్రాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంది బిగ్టీవీ. అలాంటి బిగ్టీవీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ కొందరికి మింగుడు పడటం లేదు. ఇందుకు నిన్నటి ఘటనే ఓ ఉదాహరణ. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ సురేష్బాబు మధ్య చెత్త తరలింపుపై ఏర్పడిన వివాదాన్ని ఇతర ఛానళ్లు పోటీ పడనంత వేగంగా లైవ్ ప్రసారాలు చేసింది బిగ్ టీవీ. ఈ క్రమంలో కొందరు బిగ్టీవీ ప్రతినిధి బాడీ లాంగ్వేజ్ను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కడప మేయర్ ఇంట్లో చెత్తను బిగ్టీవీ ప్రతినిధే వేయించారంటూ సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీన్ని బిగ్టీవీ ఖండిస్తోంది.
ఈ వీడియోను ఒకసారి చూడండి. లైవ్ కవరేజ్ ఇచ్చేందుకు బిగ్టీవీ ప్రతినిధి రెడీ అయ్యారు. ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తితో మాట్లాడించేందుకు సిద్ధం చేసుకున్నారు. కానీ.. చెత్త వేయండి అన్నట్టు మా ప్రతినిధి అక్కడున్న వారికి సైగ చేశారంటూ మొన్నటివరకు అధికారంలో ఉన్న వైసీపీ సైతం సోషల్ మీడియాలో పోస్టు చేయడం విడ్డూరంగా మారింది. జనం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.
మరోసారి ఈ వీడియోను నిశితంగా పరిశీలించండి. ఆందోళనకారుడితో లైవ్లో మాట్లాడించేందుకు మా ప్రతినిధి రెడీ అవుతున్నారు. చెత్త వేసినది ఇతను కాదు. అవతలున్న మరో వ్యక్తి.. మేయర్ ఇంట్లోకి చెత్త విసిరాడు. దీనికి మా ప్రతినిధికి ఏంటి సంబంధం?
లైవ్ ఇచ్చే సమయంలో మాట్లాడడానికి ధర్నా చేస్తున్న వ్యక్తిని పైకి లేవమని మాత్రమే పిలిచారు మా రిపోర్టర్ మధు. సరిగ్గా అదే సమయంలో మరో వ్యక్తి మేయర్ ఇంట్లోకి చెత్త వేయించారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. మేయర్ సురేష్బాబు ఇంట్లో కడప జనం చెత్త విసురుతున్నప్పుడు ఆ విజువల్స్ని మేము లైవ్లో చూపించలేదు. చెత్త వేసిన తర్వాత మాత్రమే ఆ దృశ్యాల్ని ప్రసారం చేశాం.
Also Read: పిల్లల భవిష్యత్తు కోసం సౌదీ వెళ్లి.. తిరిగి వస్తూ అనాధలా చనిపోయింది.
లైవ్ కవరేజ్ కోసం చెత్త వేయించే దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గులకే వస్తాయి తప్ప.. నిఖార్సైన జర్నలిజంతో దూసుకెళ్తున్న బిగ్టీవీకి రావు. అలాంటి రిపోర్టింగ్ చేయదు. గందరగోళం మధ్య మా ప్రతినిధి లైవ్లో అక్కడి పరిస్థితుల్ని వివరించారు. ఇదీ అసలు జరిగిన కథ. కానీ బిగ్ టీవీ ప్రతినిధే మేయర్ ఇంట్లో చెత్త వేయించినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో.. వైసీపీ సహా ట్రోలర్స్ ఆలోచించుకోవాలి.
బిగ్ టీవీ ఎప్పుడూ మ్యానిప్యులేటెడ్ వార్తలు ప్రసారం చేయదు. ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మా నైజం. అందులో ఎప్పుడూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇక ముందు కూడా వేయబోదు. ఇలాంటి ట్రోలింగ్స్కు అదిరేది లేదు. బెదిరేది లేదు. అసలు సిసలు వార్తలు ప్రసారం చేసే ఛానల్కు.. రాజకీయ రంగు పులిమే కట్టుకథలు ఇప్పటికైనా మానుకోండి. బిగ్ టీవీపై దుష్ప్రచారం చేసి, ప్రజాదరణ తగ్గించాలని చూసేవారికి ఇదే హెచ్చరిక. ప్రజా సమస్యల్ని చూపించడం ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలనేది మా ప్రయత్నం. మీ కుటిల ప్రయత్నాలు, కుట్రలు ఫలించవు.