Indrakiladri : విజయవాడ దుర్గగుడిలో నకిలీ పాసుల కలకలం రేపింది. 500 రూపాయల టికెట్ చెకింగ్ వద్ద నకిలీ పాసులతో వెళ్తున్న వారిని గుర్తించిన ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అడ్డుకున్న సిబ్బందిపై తల్లీకొడుకులు వాగ్వాదానికి దిగారు. ట్రస్ట్ బోర్డు మెంబర్ రాంబాబు పేరు చెప్పి సిబ్బందిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. సీన్లోకి పోలీసులు ఎంటర్ కావడంతో వివాదం సర్దుమనిగింది. నకిలీ పాసుల వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు ఆలయ సిబ్బంది
మరోవైపు ఇంద్రకీలాద్రిలో అధికారులు వర్సెస్ పాలకమండలిగా మారింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై పాలకమండలి సభ్యులు మండిపడుతున్నారు. దర్శన సమయంలో పాలకమండలి కుటుంబ సభ్యులను పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా కుటుంబాలతో దర్శనం చేసుకుంటున్నారని పాలకమండలి సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ వారికి లేని ఆంక్షలు తమకు మాత్రమే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక అధికారుల తీరుపైనా భక్తులు గరంగరం అవుతున్నారు. 500 రూపాయలు వెచ్చించి ప్రత్యేక టికెట్లు తీసుకున్నా.. అమ్మవారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు.