NBK PSPK: ఈ ఫోటో ఇప్పటికే చూసే ఉంటారుగా. తెగ వైరల్ అవుతున్న పిక్. ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇటు పవన్ ఫ్యాన్స్, అటు బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్న పిక్చర్ ఇది. ఈ ఒక్క ఫోటో.. కొందరి మతి పోగొడుతోంది. మరికొందరిని కలవర పెడుతోంది. ఈ రేర్ కాంబినేషన్ ఏంట్రా బాబూ.. అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
చాలాకాలం పాటు మెగా ఫ్యామిలీకి, బాలయ్యకు మధ్య బాగా దూరం ఉండేది. వాళ్లు, వీళ్లు కలవడం చాలా అరుదు. ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ వాగ్వాదమే. సోషల్ మీడియాలో పంచ్ లే. అలాంటిది, ఆహాలో అన్ స్టాపబుల్ షోతో సీన్ మొత్తం మారిపోయింది. బాలయ్య-అల్లు కుటుంబం మధ్య స్నేహం కుదిరింది. పరోక్షంగా మెగా ఫ్యామిలీ సైతం దగ్గరైంది. అప్పటి నుంచి అంతా కలిసిపోయారు. అన్ స్టాపబుల్ కోసం వరుసబెట్టి సినీ, రాజకీయ ప్రముఖులతో షో చేస్తున్న బాలయ్య బాబును.. సడెన్ గా పవన్ కల్యాణ్ కలవడం రాజకీయంగానూ కలకలం రేపుతోంది.
వారి కలయిక.. అన్ స్టాపబుల్ కోసం అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. రాజకీయం కారణమే అంటున్నారు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు బావమరిది. ఇక పవన్ జనసేనాని. వాళ్లిద్దరి పంతం ఒక్కటే.. ఉమ్మడి టార్గెట్ జగన్ ఒక్కడే. అందుకే బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ల భేటీ వెనుక రాజకీయ వ్యూహం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కేవలం షో కోసమే అయితే, వారిద్దరూ ఏకాంతంగా సమావేశం కానవసరం లేదని అంటున్నారు. 20 నిమిషాలు వన్ టు వన్ చర్చించుకున్నారంటే.. సంథింగ్ సంథింగ్ అని చెప్పేస్తున్నారు.
ఏపీలో ఈసారి జనసేన, టీడీపీల పొత్తు ఉంటుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ముందుముందు ఎలాగూ కలిసి పని చేయాల్సిందే. ఇద్దరూ అన్నపూర్ణ స్టూడియోలోనే ఉన్నారు. ఓ సారి కలుస్తే పోలా.. అని వారు అనుకొని ఉండొచ్చు. కానీ.. దశాబ్దాల దూరం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దగ్గరవడం..అత్యంత ఆసక్తికరం. అందుకే, వారిది రేర్ కాంబినేషన్ అంటూ.. ఆ కలర్ ఫోటో అదుర్స్ అంటూ.. సోషల్ మీడియాలో గోల గోల నడుస్తోంది. జై బాలయ్య.. జై జనసేన.. అంటూ అభిమానులు జోరు మీదున్నారు.