టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆయన నిశ్చితార్థ వేడుక సింపుల్ గా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లితో రాధాకు ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆదివారం నరసాపురంలో ఈ కార్యక్రమం కొద్దిమంది అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు.
అక్టోబర్ 22న వివాహం జరిపించాలని ముహూర్తం పెట్టారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు రాధా, పుష్పవల్లి జంట వివాహం ఘనంగా నిర్వహించనున్నారు. నిశ్చితార్థ వేడుకకు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు. కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు.