Vijaysai Reddy: కొన్ని రోజులుగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చుట్టూ వివాదం రేగుతున్నది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఆమెకు అక్రమ సంబంధం ఉన్నదని రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. శాంతి భర్తగా చెప్పుకున్న మదన్ మోహన్ అనే వ్యక్తి దేవాదాయ శాఖ కమిషనర్కు ఆయన చేసిన ఫిర్యాదు కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన భార్య గర్భవతి కావడానికి విజయసాయి రెడ్డి కారణమనే అనుమానాన్ని పేర్కొంటూ పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చడానికి దర్యాప్తు చేయాలని కమిషనర్ను కోరారు. ఆ ఫిర్యాదు కాపీ ఆధారంగా విజయసాయి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి బయటికి వచ్చి ఈ వ్యవహారంపై స్పందించారు.
2013లో మదన్ మోహన్తో తనకు వివాహం జరిగిందని, లా చదువుతుండగానే పెళ్లి చేసుకున్నామని, కానీ, పెళ్లయ్యాక మదన్ మోహన్ తనను చాలా వేధించాడని శాంతి ఆరోపించారు. 2016లో తామిద్దరం విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నామని, పిల్లలు, బంగారం, కారు విషయంలో పరస్పర ఆమోదయోగ్య ఒప్పందం కూడా రాసుకున్నామని వివరించారు. ఆ తర్వాత తాను సుభాష్ అనే వ్యక్తిని పెళ్లాడినట్టు తెలిపారు.
2021 వరకు తాను విశాఖలోనే ఉండేదాన్నని, తాను మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ మదన్ తనను వేధిస్తూనే ఉన్నారని శాంతి ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చాక మదన్కు పిల్లలను చూపించానని, కానీ, డబ్బు కోసమే మదన్ మోహన్ ఇలాంటి అనుమానాలు సృష్టించే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక విజయసాయి రెడ్డితో పరిచయం గురించి, తాజా వ్యవహారం గురించి ఆమె ఇలా వివరించారు.
తాను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళనని, అందుకే తనను ఇంత మంది టార్గెట్ చేశారని, వేరే కులానికి చెందిన అమ్మాయి అయితే ఇంతలా మాటలు అనగలిగేవారా? అని శాంతి ప్రశ్నించారు. ఒక ఎస్టీ అమ్మాయి ఉద్యోగం చేయకూడదా? మంచి బట్టలు వేసుకోకూడదా? నగలు ధరించకూడదా? అని నిలదీశారు. తాను కష్టపడి న్యాయవాద విద్యను చదివానని, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశానని, ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
విజయసాయి రెడ్డి గౌరవనీయ వ్యక్తి అని, తాను తొలిసారి విశాఖలోనే ఆయనను చూసినట్టు శాంతి వివరించారు. తమది నంద్యా, రాయలసీమలో తనకు ఒక సర్పంచ్ కూడా తెలియదని చెప్పారు. సీమలో ఆడపిల్లలు బయట ఊర్లు తిరిగడానికి ఉండదని, అలాంటిది ఒక ఎంపీ పరిచయం అయ్యే సరికి ఇలా ఉంటుందా? అని అనిపించిందని తెలిపారు. దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనే సంస్థ ఉందని, దాని వ్యవహారాలు చూసుకోవాల్సింది అసిస్టెంట్ కమిషనరేనని వివరించారు. ప్రేమ సమాజం సంస్థకు విశాఖ బీచ్ రోడ్డులో 30 ఎకరాల భూమి ఉందని, అందులో సాయి ప్రియా రిసార్ట్స్ అనే కంపెనీ ఉన్నదని, ఆ రిసార్ట్స్ వాళ్లు 30 ఎకరాల భూమికి చాలా తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారని, సాయి రెడ్డి సార్ ద్వారా ఆ విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. దాంతో తాను ఆ స్థలం ఇన్స్పెక్షన్కు వెళ్లానని, అక్కడి నిర్వాహకులతో మాట్లాడి లీజు పెంచి ప్రేమ సమాజం సంస్థకు మేలు చేసే ప్రయత్నం చేశానని శాంతి వివరించారు. అంతకు మించి తనకు సాయి రెడ్డి సార్తో మరేమీ లేదని శాంతి విలపించారు. విజయసాయి రెడ్డి తనకు తండ్రి వంటివాడని, దయచేసి ఆయనతో సంబంధం అంటగట్టకండని వేడుకున్నారు. ఇలా తన క్యారెక్టర్ను చంపేస్తే.. ఉద్యోగం ఎలా చేసేదని ప్రశ్నించారు.