AP employees strike latest news(Andhra Pradesh today news): ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకి సై అన్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగితున్నామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉద్యోగులు తొలిసారి సమ్మెకు దిగుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డెడ్ లైన్ విధించారు.
తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వంతో అనేకసార్లు చర్చలు జరిపారు. కానీ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేకపోవడంతో సమ్మెబాట పడుతున్నారు.
వారంపాటు సమ్మె వాయిదా వేయాలని యాజమాన్యం కోరింది. కుదరదని జేఏసీ నేతలు తేల్చి చెప్పేశారు. మంత్రివర్గ ఉపసంఘంతో చర్చిద్దామని ఉద్యోగ సంఘాలకు యాజమాన్యం సూచించింది. సీఎం జగన్ తో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. కానీ ఉద్యోగులు సమ్మెకే మొగ్గుచూపారు. నేటి అర్ధరాత్రి నుంచి యాజమాన్యానికి ఉద్యోగులు సిమ్ లు హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై యాజమాన్యం దృష్టి సారించింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉద్యోగులను రంగంలోకి దించేందుకు చర్యలు తీసుకుంటోంది. గురువారం నుంచి వారు విధుల్లోకి రావాలని కోరింది.
విద్యుత్ ఉద్యోగుల సమ్మె పిలుపుతో ఏపీలో పోలీసులను భారీగా మోహరించారు. విద్యుత్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.