Election code in ap is over: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ముగిసింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సాయంత్రం 6 గంటలతో ఎన్నికల కోడ్ ముగిసినట్టు అందులో పేర్కొన్నది. మార్చి 16వ తేదీ మధ్నాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన విషయం విధితమే.
కాగా, ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల అయ్యాయి. కూటమి ఊహించని విధంగా సీట్లను కైవసం చేసుకుంది. కూటమిలో భాగమైన జనసేన పార్టీ కూడా చరిత్ర సృష్టించింది. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇటు చంద్రబాబు, లోకశ్ కూడా భారీ మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు ఊహించని రీతిలో మెజారిటీ వచ్చింది. అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. కూటమిలోని బీజేపీకి కూడా 8 సీట్లు వచ్చాయి.
అత్యధిక సీట్లతో ఏపీలో గెలిచిన టీడీపీ, జనసేన పార్టీలు అటు కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కీలక పాత్రను పోషించబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. మరోదఫా ఇవాళ కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో టీడీపీకి ఇచ్చే మంత్రి పదవులపై చర్చించే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఇతర మిగతా విషయాలపై కూడా చర్చించే అవకాశముంది.
Also Read: ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది.. ఇకమీదట అలా ఉండబోదు’
ఇందుకు సంబంధించి ఇప్పటికే టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పనిచేయాలంటూ సూచించారు. ప్రజల అభివృద్ధి కోసం పాటు పడాలని, ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలన్నారు. ప్రతిక్షణం అందుబాటులో ఉంటానంటూ ఎంపీలకు చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే.