Jagan : ఏపీ సీఎం జగన్ రాజమండ్రిలో పాల్గొన్న సభ వద్ద ఓ వృద్ధురాలు ప్రమాదానికి గురయ్యారు. సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె బస్సు దిగే క్రమంలో పడిపోయారు. ఆమె దిగక ముందే బస్సు ఒక్కసారిగా కదలడంతో ఈ ప్రమాదం జరిగింది.
పింఛన్ల పెంపు వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో సీఎం జగన్ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సభకు అర్జి పార్వతి (70) అనే వృద్ధురాలు వచ్చారు. సభాస్థలి వద్ద దిగుతుండగా బస్సు కదలడంతో ఆమె కిందపడిపోయారు. అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న మరో వాహనం వృద్ధురాలి కాళ్ల పైనుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో పార్వతి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితురాలని ఆస్పత్రికి తరలించారు.
ఏపీలో రాజకీయ పార్టీల సభలు రక్తాన్ని చిందిస్తున్నాయి. కందుకూరు, గుంటూరులో టీడీపీ సభల్లో జరిగిన తొక్కిసలాటలు మొత్తం 11 మందిని బలితీసుకున్నాయి. ఈ దుర్ఘటనలో గాయపడ్డ అనేక మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు వైసీపీ సభ వద్ద ప్రమాదం జరగడం రాజకీయ పార్టీల కార్యక్రమాల నిర్వహణలో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. కందుకూరు, గుంటూరు ఘటనలపై వైసీపీ చంద్రబాబు నిందిస్తూ విమర్శలు చేసింది. అటు టీడీపీ ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగాయని ఎదురుదాడి చేసింది. తాజాగా రాజమండ్రిలో జరిగిన ప్రమాదంపై ఈ రెండు పార్టీల మధ్య వార్ మరింత ముదరే అవకాశం ఉంది.