Pawan Vs dwarampudi : పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ జనసేనాని బుల్లెట్ లాంటి డైలాగ్స్ పేల్చుతున్నారు. కాకినాడ సర్పవరం కూడలి బహిరంగ సభలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డికి పవన్ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే నేరసామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని స్పష్టం చేశారు. ద్వారంపూడి, వాళ్ల తాత, నాన్న అందరూ పెద్దపెద్ద రౌడీలని విమర్శించారు. బియ్యం అక్రమ రవాణా సూత్రధారి చంద్రశేఖర్రెడ్డేనని ఆరోపించారు. ఈ మూడేళ్లలో రూ.15 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
పవన్ కు కౌంటర్ గా వైసీపీ నేతలు మాటలు యుద్ధాన్ని మరింత పెంచారు. జనసేనానికి ద్వారంపూడి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను 3సార్లు పోటీ చేస్తే 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ద్వారంపూడి అన్నారు. పవన్ మాత్రం పోటీ చేసిన రెండో చోట్లా ఓడిపోయారని చురకలు అంటించారు. పొలిటికల్గా పవన్ జీరో అని మండిపడ్డారు.
జనసేన అజెండా ఏంటి? అని ద్వారంపూడి ప్రశ్నించారు. మార్చి 14న తనకు సీఎం అయ్యే అర్హత లేదని చెప్పి పవన్.. ఇప్పుడు మాట మార్చారని తెలిపారు. చంద్రబాబుతో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతోనే ఇప్పుడు ఎమ్మెల్యే, సీఎంను చేయండి అని అడుగుతున్నారన్నారు. రాజకీయాల్లో సీఎం కావడం పవన్కు సాధ్యం కాదని తేల్చేచెప్పారు. అది సినిమాల్లోనే సాధ్యమవుతుందన్నారు.
తనపై చేసిన ఆరోపణలను పవన్ నిరూపించాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. కాకినాడలో గత 50 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ తనను ఓడించడం పవన్ వల్ల కాదని స్పష్టం చేశారు. తనను ఓడిస్తానని పవన్ చేసిన ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. తాను 15 వేల కోట్లు సంపాదిస్తే పవన్ ను ప్యాకేజీతో కొనేవాడని సైటర్లు వేశారు.