Dussehra Special Trains: దసరా, దీపావళి పర్వదినాలు రానే వస్తున్నాయి. ఇక నగరాలు ఖాళీ కానున్నాయని చెప్పవచ్చు. ఎందుకో తెలుసా.. గ్రామాల నుండి నగరాలు, పట్టణాలకు ఉపాధి నిమిత్తం వచ్చిన వారు ఈ పర్వదినాలకు ఇంటి బాట పట్టేస్తారు. తమ వారితో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నదే వీరి కోరిక. అందుకే ఈ నెలలో దసరా, దీపావళిని పురస్కరించుకొని ఇప్పటికే బస్టాండ్ లు , రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఏ బస్టాండ్, ఏ రైల్వే స్టేషన్ చూసినా.. రద్దీ.. రద్దీనే.
ఇప్పటికే ఈ పండుగలను దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ముందుగానే సిద్దం చేసింది. దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కాగా.. దసరా పర్వదినానికి ఒకరోజు ముందు ప్రయాణీకుల (Passengers) హడావుడి అధికం కానుంది. అందుకే ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు బస్సుల సంఖ్యను పెంచి, ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాయి. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రం.. ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తారు.
రైలు ప్రయాణం ప్రతిసారీ మనకు కొత్త అనుభూతుని అందిస్తుంది. పిల్లలతో సుదూరానికి ప్రయాణించే వారికి రైలు ప్రయాణం గొప్ప అవకాశమని చెప్పవచ్చు. అందుకే రైళ్ల ప్రయాణానికి అధికంగా ప్రజాదరణ ఉంటుంది. అందుకే ఈసారి దసరా, దీపావళి పర్వదినాల కోసం ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. రైల్వే ముందస్తుగానే అప్రమత్తమైంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాల నుండి పలు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది.
Also Read: Shani Margi: దీపావళి నుంచి ఈ 4 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు
అయితే రైల్వేస్టేషన్ లకు ఇప్పటి నుండే ప్రయాణికులు పోటెత్తుతుండగా.. రైల్వే ప్రయాణీకుల (Railway Passengers) అవసరాన్ని గుర్తించి రైల్వే స్టేషన్ ల వద్ద టికెట్ జాప్యానికి నివారణ చర్యలు చేపట్టింది. అందుకై అదనపు టికెట్ కౌంటర్లను కూడా రైల్వే ఏర్పాటు చేస్తోంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 800 స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ద.మ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ప్రకటించారు. స్వగ్రామాలకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు.. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాగా రైళ్లలో ప్రయాణించే (Railway Passengers) వారు తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించాలని, అలాగే రిజర్వేషన్ చేయించుకున్న వారిని.. వారి సీట్లలో కూర్చునే విధంగా ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. అలాగే టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా తప్పదని, తనిఖీలు సైతం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఏదైనా ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 139 ను కాల్ చేయవచ్చని, మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు నిత్యం రైల్వే కృషి చేస్తుందన్నారు.